Microsoft: ‘మైక్రోసాఫ్ట్‌లో లంచాలకు రూ.వేల కోట్ల కేటాయింపు’

విదేశాల్లో ఒప్పందాల ఖరారుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారీ ఎత్తున లంచాలు ఇస్తోందని మాజీ ఉద్యోగి యాసర్‌ ఎలాబ్‌ ఆరోపించారు....

Published : 26 Mar 2022 14:12 IST

ఓ మాజీ ఉద్యోగి ఆరోపణ

వాషింగ్టన్‌: విదేశాల్లో ఒప్పందాల ఖరారుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారీ ఎత్తున లంచాలు ఇస్తోందని మాజీ ఉద్యోగి యాసర్‌ ఎలాబ్‌ ఆరోపించారు. ముడుపులు, లంచాల కోసం ఏటా 200 మిలియన్ డాలర్లు (₹1.5 వేల కోట్లు) కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజావేగుల వేదికగా మారిన లయనెస్‌ వెబ్‌సైట్‌లో ఓ వ్యాసం రాశారు.

ఘనా, నైజీరియా, జింబాబ్వే, కతార్‌, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఒప్పందాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్లు ఎలాబ్‌ ఆరోపించారు. 1998లో సంస్థలో చేరిన తాను మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో సంస్థ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంపై పనిచేశానన్నారు. ఈ క్రమంలో తన పనితీరును మెచ్చి కంపెనీలో పలు పదోన్నతులు పొందినట్లు పేర్కొన్నారు.

కొంతకాలం గడిచిన తర్వాత సంస్థలో కొంత వింత పోకడను గమనించానని ఎలాబ్‌ తెలిపారు. తన కంటే కింది హోదాలో అనేక మంది ఉద్యోగులు విలాసవంతమైన కార్లు, విల్లాలు కొనుక్కొని జీవితం గడుపుతున్నట్లు గమనించానన్నారు. తాను మాత్రం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇల్లు కొనడానికే కష్టపడ్డానని తెలిపారు. 2016లో 40 వేల డాలర్ల మంజూరుకు తనకు ఓ అభ్యర్థన వచ్చిందని తెలిపారు. ఓ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈ మొత్తం కావాలని కోరినట్లు తెలిపారు. కానీ, కస్టమర్‌కు సంబంధించిన వివరాలు కంపెనీ ‘పొటెన్షియల్‌ క్లయింట్స్‌’ డేటాబేస్‌లో లేవని తెలిపారు. తీరా చూస్తే ఆ క్లయింట్‌ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగేనని తేలిందన్నారు. నాలుగు నెలల క్రితమే అతణ్ని సంస్థ బయటకు పంపిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సంస్థతో ఆరు నెలల వరకు ఎలాంటి భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని పై స్థాయి వారి దృష్టికి తీసుకెళితే.. 40 వేల డాలర్ల మంజూరును నిలిపివేశారని ఎలాబ్‌ తెలిపారు. కానీ, ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులపై మాత్రం ఎలాంటి విచారణకు ఆదేశించలేదని వెల్లడించారు. సీఈఓ సత్య నాదెళ్ల, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఉపాధ్యక్షుడికి కూడా లేఖ రాశానన్నారు. విషయాన్ని నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లినందుకు తనపై ప్రతీకార చర్యలు ప్రారంభించారన్నారు. అప్పటి వరకు ‘స్టార్‌ పెర్ఫార్మర్‌’గా ఉన్న తనను ‘పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌’లో చేర్చారని ఆరోపించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డుకు కూడా ఈ విషయాన్ని తెలియజేశానన్నారు. అక్కడి నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్నారు. తనతో పాటు మరో ఐదుగురు కూడా మైక్రోసాఫ్ట్‌లో జరుగుతున్న అవినీతి గురించి గళం విప్పారన్నారు. వారందరినీ సంస్థ నుంచి బయటకు పంపారని తెలిపారు.

ఈ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌కు వివరణ ఇచ్చింది. కంపెనీలో ఎలాంటి అనైతిక చర్యలకు అవకాశం ఇవ్వబోమని తెలిపింది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులను అనుమతించబోమని పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగితే ఎవరైనా తమ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు కంపెనీలో ఉందని తెలిపింది. ఎలాబ్‌ చేసిన ఆరోపణలు చాలా పాతవని.. వీటిపై ఇప్పటికే విచారణ జరిపి సమస్యను పరిష్కరించామని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని