Microsoft: మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం.. భారత్‌ సహా పలు దేశాల్లో సర్వీసులు డౌన్‌..!

పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సేవలు మొరాయిస్తున్నాయి. అవుట్‌లుక్‌, టీమ్స్‌ సహా పలు సేవలు పనిచేయడం లేదు.

Updated : 25 Jan 2023 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్‌ సహా పలు దేశాల్లో అవుట్‌లుక్‌, ఎంఎస్‌ టీమ్స్‌, అజ్యూర్‌, మైక్రోసాఫ్ట్‌ 365 వంటి సేవలు బుధవారం పనిచేయడం లేదు. దీంతో వేలాది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్‌ దర్యాప్తు చేపట్టింది. అయితే ఎంతమంది యూజర్లపై దీని ప్రభావం పడిందనేది సంస్థ వెల్లడించలేదు.

భారత్‌ సహా జపాన్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాల్లో ఈ సేవలకు అంతరాయం కలిగింది. అవుట్‌లుక్‌ (Outlook) వెబ్‌సైట్‌ రీఫ్రెష్‌ అవడం లేదని, ఈమెయిళ్లు రావడం లేదని పలువురు యూజర్లు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ (MS Teams) పనిచేయడం లేదని భారత్‌లో ఇప్పటివరకు 3700 మంది యూజర్లు ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌.కామ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. జపాన్‌లో 900 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. టీమ్స్‌ నుంచి కాల్స్‌, మెసేజ్‌లు చేయలేకపోతున్నామని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అవుట్‌లుక్‌, టీమ్స్‌ మాత్రమే గాక, మైక్రోసాఫ్ట్‌ (Microsoft)లోని ఇతర సేవలు కూడా పనిచేయడం లేదని కొందరు యూజర్లు ఆరోపిస్తున్నారు.

దీనిపై మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ స్పందించింది. సమస్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌కు 28 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. బిజినెస్‌లు, స్కూళ్లలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని