SpiceJet: విమాన టికెట్‌ ధరలు 10 15% పెంచాల్సిందే..!

విమాన ఇంధన ధరలు నానాటికీ పెరుగుతోన్న వేళ నిర్వహణ ఖర్చులను భరించాలంటే టికెట్‌ ధరలను తక్షణమే పెంచాలని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (SpiceJet) అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన టికెట్‌

Updated : 16 Jun 2022 11:56 IST

స్పైస్‌జెట్‌ సీఎండీ వ్యాఖ్యలు

దిల్లీ: విమాన ఇంధన ధరలు నానాటికీ పెరుగుతోన్న వేళ నిర్వహణ ఖర్చులను భరించాలంటే టికెట్‌ ధరలను తక్షణమే పెంచాలని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (SpiceJet) అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన టికెట్‌ ధరలను కనీసం 10-15 శాతం పెంచాల్సిందేనని ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

‘‘2021 జూన్‌ నుంచి ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ATF) ధర 120 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఏటీఎఫ్‌పై పన్నులు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్ని నెలలుగా విమాన ఇంధన ధరలను భరించేందుకు వీలైనంతగా ప్రయత్నించాం. మా నిర్వహణ వ్యయాల్లో దాదాపు 50శాతానికి పైగా ఇంధనానికే ఖర్చవుతోంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తుండటం ఎయిర్‌లైన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చులను భరించాలంటే విమాన టికెట్‌ ధరలను కనీసం 10 నుంచి 15 శాతం పెంచడం తప్ప మరో మార్గం కన్పించట్లేదు’’ అని అజయ్‌ సింగ్‌ అన్నారు.

కరోనా దృష్ట్యా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2020 మార్చి-ఏప్రిల్‌ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత మే 25, 2020 నుంచి దశల వారీగా విమాన సర్వీసులను పునరుద్ధరించారు. అయితే, ఆ సమయంలో అటు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా, ఇటు విమానయాన సంస్థలకు నష్టం వాటిల్లకుండా కేంద్ర పౌరవిమానయాన శాఖ చర్యలు తీసుకుంది. విమాన టికెట్ల ధరలపై ప్రయాణ సమయం ఆధారంగా పరిమితి విధించింది. ఉదాహరణకు ప్రయాణం 40 నిమిషాల కంటే తక్కువ సమయం ఉండే సర్వీసులకు కనిష్ఠ టికెట్‌ ధర రూ.2,900 (జీఎస్‌టీ కాకుండా), గరిష్ఠ ధర రూ.8,800 (జీఎస్‌టీ కాకుండా)గా నిర్ణయించారు. అయితే, ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు కొండెక్కాయి. దీంతో నిర్వహణ భారంగా మారిందని ఎయిర్‌లైన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

షేర్లు ఢమాల్‌..

అజయ్‌ సింగ్ వ్యాఖ్యలు స్పైస్‌జెట్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఈ సంస్థ షేర్లు భారీగా కుంగాయి. ఉదయం 11.20 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఈ షేరు ధర 4.89శాతం తగ్గి రూ.41.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేరు ధర దాదాపు 5శాతం పతనమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని