మేనేజర్లు ఇంటికి.. వాళ్లు ఎంపిక చేసిన వారు ఆ స్థానంలోకి.. అట్లుంటది మరి మస్క్‌తోని!

ట్విటర్‌(Twitter)లో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల తీసివేతకు సంబంధించి మస్క్‌ (Elon Musk) అనుసరించిన విధానంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. మస్క్‌తో పని అంత ఈజీ కాదని కామెంట్‌ చేస్తున్నారు.

Updated : 10 Mar 2023 20:11 IST

కాలిఫోర్నియా: ట్విటర్‌ (Twitter) సీఈవోగా ఎలాన్‌ మస్క్‌(Elon MUsk) తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థ ఉద్యోగులతోపాటు, మార్కెట్‌ వర్గాలను సైతం షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు నుంచి ట్విటర్ సబ్‌స్క్రిప్షన్‌ వరకు ప్రతిదీ సంచలనమే. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సంస్థలో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల తీసివేతకు సంబంధించి మస్క్‌ అనుసరించిన విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి తెలిసి కొందరు మస్క్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అంతే మరి మస్క్‌తో పని అంత ఈజీ కాదని కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

గతేడాది నవంబరులో ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌, లీగల్‌ పాలసీ విభాగాధిపతి విజయ గద్దెతోపాటు సుమారు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తర్వాత ట్విటర్‌ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్‌ మస్క్.. అప్పటి నుంచి గత నెల చివరి వారం వరకు మూడు విడతలుగా ఉద్యోగాల్లో కోత విధించారు. 

గత నెల చివర్లో తొలగించిన మేనేజర్లతో ప్రమోషన్ల కోసం ప్రతి టీమ్‌ నుంచి ఉత్తమ ఉద్యోగిని ఎంపిక చేయాలని మస్క్‌ చెప్పారట. తర్వాత మేనేజర్లను తొలగించి వారి స్థానంలో ఉత్తమ ఉద్యోగులగా ఎంపికైన వారికి మేనేజర్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలా సుమారు 50 మందిని మస్క్‌ తొలగించారట. మేనేజర్‌ స్థాయిలో ఉండి వారు అందుకుంటున్న జీతం ఎక్కువగా ఉండటంతో.. కంపెనీపై ఆర్థికపరమైన భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారితో చెప్పారని పలువురు సోషల్‌ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్తగా మేనేజర్‌ బాధ్యతలు అందుకున్న వారు తక్కువ జీతానికి పనిచేసేందుకు అంగీకరించినట్లు మస్క్‌ వారితో చెప్పినట్లు తెలిపారు. ఇలా తొలగించిన వారిలో ఎస్తేర్‌ క్రాఫోర్డ్‌ కూడా ఒకరు. ట్విటర్‌లో తొలిసారి ఉద్యోగాల కోత సమయంలో..  పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ ఆఫీసులో నేలపైనే పడుకున్న ఈమె ఫొటో అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. మరోవైపు ట్విటర్‌ ఆదాయాన్ని పెంచేందుకు మస్క్‌ ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సబ్‌స్క్రిప్షన్‌ రెవెన్యూ లేకుండా ట్విటర్‌ను కొనసాగించడం సాధ్యం కాదని, ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ పేర్కొన్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని