Twitter: అందుకే 5వారాలు దానిపైనే పిచ్చోడిలా పనిచేశా: ఎలాన్‌ మస్క్‌

ట్విటర్‌ ఆర్థిక పరిస్థితి వచ్చే ఏడాది కల్లా గాడిన పడుతుందని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. దానికి తాను తీసుకుంటున్న చర్యలే దోహదం చేస్తాయని వివరించారు.

Published : 22 Dec 2022 14:46 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter) ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తాను తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అన్నారు. వచ్చే ఏడాది కల్లా కంపెనీ ఆర్థికంగా గాడినపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యయ నియంత్రణ కోసం తాను చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. బుధవారం ట్విటర్‌ (Twitter) యూజర్లతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉద్యోగుల తొలగింపు సహా ఇతర కఠిన నిర్ణయాలను మస్క్‌ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. ఆ చర్యలే తీసుకోకపోయి ఉంటే ఏటా ట్విటర్‌ మూడు బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదన్నారు. అందుకే గత ఐదు వారాలుగా ఖర్చులు తగ్గించడంపైనే పిచ్చోడిలా గడిపానని పేర్కొన్నారు. ట్విటర్ పరిస్థితి గతి తప్పి నేలకూలుతున్న విమానం వలే ఉండేదని వ్యాఖ్యానించారు. వ్యయాలను నియంత్రించడం, సబ్‌స్క్రైబర్ల ఆదాయాన్ని పెంచుకోవాలనే వ్యూహంతోనే ముందుకెళ్లినట్లు వివరించారు.

ప్రకటనదారులు ట్విటర్‌పై ఖర్చు చేయడానికి వెనకాడుతున్న విషయం తనకు స్పష్టంగా అర్థమైందని మస్క్‌ అన్నారు. అయితే, వారి ఆందోళనలకు కంటెంట్‌ పరమైన మార్పులు చేయడం కాదని తెలిపారు. కేవలం కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏమైపోతోందననే వారు ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. నెలకు ఎనిమిది డాలర్లతో తీసుకొచ్చిన ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ కచ్చితంగా ఫలితాన్నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లేదంటే బిల్లుల్ని చెల్లించడం కష్టమైపోయేదన్నారు. హార్డ్‌వేర్‌ కోసమే ట్విటర్‌ ఏటా 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోందన్నారు.

అక్టోబరులో ట్విటర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్‌ మస్క్‌.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. ట్విటర్‌ బ్లూ సేవలకు ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి వెరిఫికేషన్‌ బ్యాడ్జితో పాటు ప్రత్యేక సేవల్ని అందిస్తున్నారు. మరోవైపు ట్విటర్‌లో నైతిక అంశాలను పర్యవేక్షించే ‘సేఫ్టీ కౌన్సిల్‌’ అనే స్వతంత్ర వ్యవస్థను పూర్తిగా తొలగించారు. అధికారిక ఖాతాల గుర్తింపు కోసం మూడు రకాల వెరిఫికేషన్‌ బ్యాడ్జిలను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలకు గ్రే, కంపెనీలకు గోల్డ్‌, వ్యక్తులకు బ్లూ టిక్‌లను ఇస్తున్నారు.

సరైన వ్యక్తి దొరికితే, వెంటనే ట్విటర్‌ సీఈఓ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఎలాన్‌ మస్క్‌ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ట్విటర్‌ సీఈఓగా కొనసాగనా? వద్దా?’ అంటూ ఆయనే ట్విటర్‌లో ఓ పోల్‌ నిర్వహించగా, ఓటు వేసిన వారిలో 57.5 శాతం మంది మస్క్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఆ ఫలితాన్ని గౌరవిస్తానని చెప్పిన మస్క్‌, తాజాగా ఇలా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి కేవలం ట్విటర్‌ సాఫ్ట్‌వేర్‌, సర్వర్‌ బృందాలను పర్యవేక్షించే బాధ్యతలకు పరిమితం అవుతానని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని