Personal loan: వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీలు గురించి తెలుసా?

personal loan: వ్యక్తిగత రుణం తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే బ్యాంకులు వసూలు చేసే ఈ ఛార్జీల గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

Published : 06 May 2023 18:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థికంగా అత్యవసర పరిస్థితుల నుంచి బయట పడటానికి వ్యక్తిగత రుణం (personal loan) ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న చాలా రకాల రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణం మాత్రమే అన్నింటికంటే తొందరగా అందుతుంది. ఈ రుణం పొందే సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండకపోవడమే ఇందుకు కారణం. పైగా వాహన, గృహ రుణాల్లా రుణ మొత్తం వినియోగం విషయంలోనూ ఎలాంటి పరిమితులూ ఉండవు. అందుకనే చాలా మంది వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వ్యక్తిగత రుణం విషయంలో బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను (Loan charges) వసూలు చేస్తుంటాయి. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు ఈ ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం..

ప్రాసెసింగ్‌ ఛార్జీలు

ప్రతి బ్యాంకూ రుణ గ్రహీత నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును (processing fee) వసూలు చేస్తుంటాయి. రుణాన్ని మంజూరు చేసేందుకు గానూ అయ్యే ఖర్చులను ఈ ఫీజు పేరిట రుణ గ్రహీత దగ్గర నుంచి తీసుకుంటాయి. దీన్ని రుణం తీసుకునే ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజుకు కనిష్ఠ, గరిష్ఠ మొత్తాలను బ్యాంకులను నిర్ణయిస్తాయి. సగటున ఈ ఫీజు 0.25 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 3 శాతం కూడా వసూలు చేస్తుంటాయి. బ్యాంకును బట్టి ఈ ఛార్జీల్లో మార్పు ఉంటుంది.

వెరిఫికేషన్‌ ఛార్జీలు

రుణాన్ని మంజూరు చేసే ముందు ప్రతి బ్యాంకూ రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని తెలుసుకుంటాయి. తిరిగి చెల్లించగలరనే నమ్మకం ఉన్న కస్టమర్లకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి.
మీ చెల్లింపు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి బ్యాంక్‌కు చెందిన వ్యక్తి గానీ, థర్డ్‌ పార్టీ వ్యక్తి గానీ మీ వివరాలను తెలుసుకుంటారు. మీ రుణ చరిత్ర, క్రెడిట్‌ రిపోర్ట్‌ వంటివి పరిశీలిస్తారు. దీని కోసం బ్యాంక్‌ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. ఆ మొత్తాన్ని కూడా వెరిఫికేషన్‌ ఛార్జీల (Verification charges) పేరిట రుణగ్రహీత నుంచి వసూలు చేస్తుంది.

ఈఎంఐ కట్టకపోతే

ఇక రుణం మంజూరు అనంతరం బ్యాంకులు మన దగ్గర వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ఈఎంఐ (EMI) చెల్లింపుల కోసం ఎల్లప్పుడూ కొంత సొమ్మును దాచుకోవాలి. నిర్దేశించిన తేదీ నాటికి బ్యాంకులో ఆ మొత్తం ఉండేట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా నెల మీరు ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే మీ దగ్గర నుంచి బ్యాంకు కొంతమొత్తం వసూలు చేస్తుంది. ఈఎంఐ ఎగవేత/బౌన్స్‌ అయిన సందర్భాల్లో కొన్ని బ్యాంకులు రూ.500+ పన్నులను వసూలు చేస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈఎంఐలను సకాలంలో చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలవ్యవధి, ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోవాలి.

ముందస్తు చెల్లింపులు చేసినా..

రుణాలపై వచ్చే వడ్డీనే బ్యాంకులు ప్రధాన ఆదాయ వనరు. ఏదైనా కారణం చేత రుణ గ్రహీతలు తమ రుణాన్ని ముందుగానే చెల్లించడానికి సిద్ధపడితే బ్యాంక్‌ వడ్డీ మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అందుచేతనే ముందస్తు చెల్లింపులపై బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. సాధారణ బ్యాంకులు వ్యక్తిగత రుణ చెల్లింపులపై 2-4 శాతం వరకు పెనాల్టీని విధిస్తున్నాయి. రుణ చెల్లింపుల్లో మిగిలిన కాలానికి అసలుపై ప్రీపేమెంట్‌ (Prepayment), ఫోర్‌క్లోజర్‌ (Foreclosure) పెనాల్టీ పేరిట ఈ ఛార్జీలను వసూలు చేస్తాయి. బ్యాంకును బట్టి ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు రుణం తీసుకున్న 12 నెలల తర్వాత మాత్రమే ముందస్తు చెల్లింపులకు అనుమతిస్తాయి. అలాగే, మిగిలిన ఉన్న కాలం ఆధారంగా పెనాల్టీ మొత్తం మారుతూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని