Zee: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఊరట.. దివాలా ప్రక్రియపై స్టే

Insolvency- Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. దివాలా ప్రక్రియపై స్టే విధించింది. 

Updated : 25 Mar 2023 16:18 IST

ముంబయి: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ZEEL)కు ఊరట లభించింది. ఆ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పునీత్‌ గొయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చింది.

జీ గ్రూప్‌ సంస్థ అయిన సిటీ నెట్‌వర్క్స్‌ రూ.89 కోట్లు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు బకాయిపడగా.. ఇందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ హామీదారుగా ఉంది. దీంతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌టీని కోరగా.. అందుకు అంగీకరించింది. ఈ అంశానికి సంబంధించి పరిష్కార నిపుణుడిగా సంజీవ్‌ కుమార్‌ జలాన్‌ను నియమించింది. సిటీ నెట్‌వర్క్స్‌ పైనా దివాలా ప్రక్రియకు బ్యాంక్‌ వేరే పిటిషన్‌నూ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో పునీత్‌ గొయెంకా పిటిషన్‌ వేయడంతో దివాలా ప్రక్రియపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ స్టే విధించింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పరిష్కారకర్త నుంచి సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కు వాయిదా పడింది. సోనీతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం ముంగిట ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలు కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సోనీతో విలీనం అంశంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు పునీత్‌ గొయెంకా సైతం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు విలువ రూ.3.20 నష్టపోయి రూ.195.45 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని