పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించొచ్చు: ఆర్‌బీఐ

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందన ధరలను తగ్గించే

Updated : 25 Feb 2021 14:50 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధ్యం

ముంబయి: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పరోక్ష పన్నులను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. బాంబే ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌(బీసీసీ) 185వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవం. కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం, ప్రభుత్వ ఖర్చులను కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ, ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన పది రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు రూ.100కు చేరువయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధనంపై భారీగా ఉన్న పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ చర్యలతో వీటి ధరలను అదుపులోకి తేవచ్చని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో పాటు దేశంలో ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తోన్న పన్నుల వల్లే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిటైల్‌ అమ్మకపు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌పై 60శాతంపైగా, డీజిల్‌పై 56శాతం పన్నుల భారం విధిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి....

రాజస్థాన్‌లో సెంచరీ కొట్టిన పెట్రో ధరలు

పోలుస్తున్నారు.. తర్వాతే కొంటున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని