సైబ‌ర్ బీమా ఎందుకు అవ‌స‌రం?

సంస్థ‌, వ్య‌క్తుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా క‌స్ట‌మైజ్డ్ సైబ‌ర్ పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. 

Updated : 17 May 2021 16:13 IST

కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్నందున‌.. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ కార‌ణంగా ఆన్‌లైన్ లావాదేవీలు సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. దీంతో పాటు సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. మాల్వేర్ యాడ్ ఫిషింగ్‌, ఇ-మెయిల్ ద్వారా ఆన్‌లైన్ మోసాల కేసులు ఏడాదికి ఏడాది పెరిగిపోతుండ‌డంతో భార‌త్‌లో సైబ‌ర్ బీమా అవ‌స‌రం కూడా పెరుగుతుంది. కోవిడ్‌-19 స‌మ‌యంలో ఈ ర‌క‌మైన కేసుల సంఖ్య మ‌రింత పెర‌గ‌డ‌మే ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది. సైబ‌ర్ మోసాల‌కు వ్య‌తిరేకంగా ద్ర‌వ్య భ‌ద్ర‌త కోసం ప‌లు బీమా సంస్థ‌లు సైబ‌ర్ బీమాను అందిస్తున్నాయి. సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడులను బీమా క‌వ‌ర్లు నిరోధించ‌లేవు అయితే ఈ న‌ష్టాల ఆర్థిక ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. ఏది ఏమైనా ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో  సైబ‌ర్ నేరాలు, మాల్వేర్ దాడుల బారిన ప‌డ‌కుండా వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

భారతదేశంలో అందుబాటులో ఉన్న సైబర్ బీమా పాలసీల గురించి ముంబైకి చెందిన ఐఆర్‌డీఏఐ రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ సలహాదారు జిగ్నేష్ షా మాట్లాడుతూ, "సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు భారతదేశంలో కార్పొరేట్ స్థాయిలోనూ, వ్యక్తిగత స్థాయిలోనూ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రి అవ‌స‌రాని త‌గిన‌ట్లు వారికి క‌స్ట‌మైజ్డ్ పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందుబాటులోకి ఉంచుతున్నాయి." అని అన్నారు. 

భారతదేశంలో ఎలాంటి మాల్వేర్.. ఫిషింగ్ దాడులకు.. వ్యతిరేకంగా సైబ‌ర్ పాల‌సీలు ఎలా.. రక్షణ కల్పిస్తాయనే అంశంపై  ఐఆర్‌డీఏఐ రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ ఆక్సిలియం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ డైరెక్టర్ దీపక్ దేశాయ్ వివ‌ర‌ణ ఇచ్చారు. "భారతదేశంలో సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని రకాల ద్రవ్య నష్టాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తున్నాయి. ఇ-దొంగతనం, ఇ-కమ్యూనికేషన్ వ‌ల్ల‌ సంభవించే ద్రవ్య నష్టాలను కవర్ చేయడమే కాకుండా, చట్టపరంగా చ‌ర్య‌లు తీసుకునే సమయంలో.. అయ్యే ఖ‌ర్చును కూడా కవర్ చేస్తుంది. "

ప్రీమియం..
రూ.650 నుంచి రూ.700 వార్షిక ప్రీమియంతో రూ.1 ల‌క్ష హామీ మొత్తాన్ని అందించే సైబ‌ర్ బీమా పాల‌సీలు భార‌త‌దేశంలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వార్షిక ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధరించాల‌ని, జీవిత బీమా, ఆరోగ్య బీమా పాల‌సీల మాదిరిగా, సైబ‌ర్ బీమా పాల‌సీల ప్రీమియం చెల్లింపుల‌కు వ్య‌క్తి వ‌య‌సుతో సంబంధం ఉండ‌ద‌ని షా తెలిపారు. 

వేటిని క‌వ‌ర్ చేస్తాయి..
సైబ‌ర్ దాడి అనంత‌రం అయ్యే ఖ‌ర్చుల‌ను సైబ‌ర్ బీమా క‌వ‌ర్ చేస్తుంది. పాల‌సీ జాబితాలో పేర్కొన్న వివిధ ర‌కాల సైబర్ నేరాలు జ‌రిగిన అనంత‌రం ప్రాసిక్యూషన్ ప్రక్రియ, రక్షణ కోసం వెచ్చించే ఖర్చు, బీమా సంస్థ చెల్లింస్తుంది. ఆర్థిక న‌ష్టం, సైబ‌ర్ నేరాల కార‌ణంగా పాల‌సీదారుడు ఆన్‌లైన్లో న‌గ‌దు కోల్పోయిన‌ప్పుడు, పాల‌సీలో ఇచ్చిన విధంగా హామీని చెల్లిస్తాయి.

భార‌త‌దేశం డిజిటైలేష‌న్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. నెట్ బ్యాంకింగ్‌, ఇత‌ర ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌లు ప‌నితీరు పెరుగుతున్న ఈ స‌మ‌యంలో థ‌ర్డ్ పార్టీ, పున‌రుద్ధరణ ఖర్చులకు వ్యతిరేకంగా నష్టపరిహారం చెల్లించ‌డంతో పాటు సైబర్-దాడి కౌన్సెలింగ్ చికిత్సలకు సంబంధించిన ఖర్చులు కూడా బీమా సంస్థ‌లు అందిస్తున్నందున ఈ పాల‌సీలు చాలా వ‌ర‌కు సైబ‌ర్ నేరాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారికి అండ‌గా ఉంటాయ‌న్న‌ది నిపుణులు న‌మ్మ‌కం.

వేటిని క‌వ‌ర్ చేయ‌వు..
అంత‌ర్జాతీయంగా, ఉద్యోశ్య‌పూర్వ‌కంగా జ‌రిగే దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. బీమా తీసుకున్న వ్య‌క్తులు మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలుకు ముందుగా జ‌రిగిన దాడుల‌ను గాని, పాల‌సీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాల‌ను గాని పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. స‌రైన పాస్‌వ‌ర్డ్‌తో యాంటి వైర‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌క‌పోయిన‌, త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోని సంధ‌ర్భాల‌లో కూడా పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని