Stock Market: ఆగని లాభాల పరుగు.. 63,000 మైలురాయిని దాటిన సెన్సెక్స్‌

Stock Market: వరుసగా ఏడోరోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. 

Published : 30 Nov 2022 16:04 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం కూడా సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దీంతో వరుసగా సూచీలు ఏడోరోజూ లాభాలు నమోదుచేశాయి. రెండు ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా ఐదోరోజూ జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్‌ 63,000 కీలక మైలురాయిని అధిగమించింది. ఈరోజే తొలిసారి 18,700 మార్క్‌ను తాకిన నిఫ్టీ తరువాతి 100 పాయింట్లను సైతం సునాయాసంగా దాటేసి 18,800ని అధిగమించింది. ఉదయం నుంచి పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలకు అఖరి అరగంటలో కొనుగోళ్ల వెల్లువతో పంట పండింది. చివరకు సెన్సెక్స్‌ 417.81 పాయింట్లు లాభపడి 63,099.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140.30 పాయింట్లు ఎగబాకి 18,758.35 వద్ద ముగిసింది. రెండు సూచీలకు ఇది రికార్డు ముగింపు కావడం విశేషం. ఇంట్రాడేలో 63,303.01 వద్ద సెన్సెక్స్‌, 18,765.20 వద్ద నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.42 వద్ద నిలిచింది.

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఈరోజు కీలక సమావేశంలో ప్రసంగించనున్నారు. వడ్డీరేట్ల పెంపుపై ఆయన నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందని మదుపర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు పీపా ధర ఇంకా 84 డాలర్ల దిగువనే ట్రేడవుతోంది. దేశీయంగా చూస్తే ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

  • జొమాటో షేరు ధర ఈరోజు 3.54 శాతం పెరిగి రూ.65.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 66.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఈ కంపెనీలో తమకు ఉన్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించాలని అలీబాబా గ్రూప్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్టాక్‌ ధర పెరిగింది.
  • ఎన్‌డీటీవీ బోర్డు నుంచి ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ పూర్తిగా వైదొలగడంతో సంస్థ షేర్లు రాణించాయి. ఈరోజు 5 శాతం పెరిగి రూ.446.30 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. ఇలా అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం ఇది వరుసగా మూడోరోజు. 
  • గ్లాండ్‌ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్‌గా ఉన్న చైనా సంస్థ ఫోసున్‌ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారమవడంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 5.43 శాతం నష్టపోయి రూ.1,776 వద్ద స్థిరపడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని