పేమెంట్ వ్యాలెట్లతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా ఇలా..!

డీమానిటైజేషన్‌ ప్రభావం వల్ల డిజిటల్‌ చెల్లింపులకి ఆదరణ పెరిగింది. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫాంల వేదికగా ద్రవ్య లావాదేవీలు సాగించారు. వాస్తవానికి 2010 నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నా ప్రజలు అంతగా మక్కువ చూపలేదు

Published : 20 May 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద నోట్ల రద్దు (డీమానటైజేషన్‌) ప్రభావం వల్ల డిజిటల్‌ చెల్లింపులకు ఆదరణ పెరిగింది. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫాంల వేదికగా ప్రజలు ద్రవ్య లావాదేవీలు కొనసాగిస్తున్నారు. నిజానికి, 2010 నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నా ప్రజలు అంతగా మక్కువ చూపలేదు. కానీ, డీమానిటైజేషన్‌ తరువాత 2016 నుంచి ఈ విధానం ఊపందుకుంది. అ సంప్రదాయానికి కొనసాగింపుగా రకరకాల యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్డ్‌లెస్‌ క్యాష్‌ విధానంలో మరో నూతన అధ్యాయమే యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్‌లతో ఏటీఎంల నుంచి డబ్బులు పొందటం. డెబిట్‌ కార్డ్‌ లేకుండా ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం.. 

గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటిని ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి? సాధారణంగా ఏటీఎంల నుంచి డబ్బులు పొందడానికి డెబిట్‌ కార్డ్‌ ప్రాథమిక మార్గం. అయితే తాజాగా ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఏటీఎంను ఆప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి ఇంటరోపర్‌బుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రా (ఐసీసీడబ్ల్యూ) ( డెబిట్‌ కార్డ్‌ అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు పొందే విధానం). దీనితో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు నుంచి యూపీఐని ఉపయోగించి డబ్బులు తీసుకోవడానికి ఈ విధానం అనుమతిచ్చేలా దీనికి సంబంధించిన సాప్ట్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తారు. తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు మరిచిపోయినా, కాలం చెల్లిన కార్డులు పనిచేయకపోయినా, దొంగతనానికి గురైన సందర్భాల్లో ఈ విధానం ఉపయోగపడుతుంది. 

తప్పనిసరిగా ఉండాల్సినవి:

* ఈ సేవను వినియోగించుకోవడానికి యూపీఐతో కూడిన ఏటీఎం మెషిన్‌ అందుబాటులో ఉండాలి. 
* ఇంటర్నెట్ కనెక్షన్‌ తప్పనిసరి. 
* వినియోగదారుడి ఫోన్‌లో ఏదైనా యూపీఐ చెల్లింపుల అప్లికేషన్‌ (ఫోన్‌ పే, గుగూల్‌ పే, పేటీఎం,అమెజాన్‌ పే వంటివి) ఉండాలి. 

డబ్బులు తీసుకునే విధానం

1. ఏదైనా ఏటీఎం దగ్గరకు వెళ్లి నగదు విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
2. తర్వాత స్క్రీన్‌లో యూపీఐ విత్‌డ్రాను క్లిక్‌ చేయాలి.
3. ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ చూపిస్తుంది.
4. ఖాతాదారుడి ఫోన్‌లో ఏదైనా యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌ని తెరిచి, క్యూఆర్ కోడ్‌ని ఆన్ చేయండి
5. కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, మీరు ఉపసంహరించుకోవాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి (ప్రస్తుతం పరిమిత మొత్తం
రూ. 5 వేలు)
6. డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రోసీడ్ నొక్కి, పిన్‌ని నమోదు చేయండి.
అంతే, ఇలా తేలిగ్గా మీ యూపీఐ చెల్లింపుల యాప్‌లను ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో సులభంగా నగదు పొందవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు