ఎన్‌పీఎస్ ఖాతా తెర‌వాల‌నుకుంటున్నారా? ఆన్‌లైన్‌లోనే తెర‌వ‌చ్చు.

18 నుంచి 70 సంవ‌త్స‌రాల‌ మ‌ధ్య వ‌య‌సు వ్య‌క్తులు ఎన్‌పీఎస్‌లో చేర‌వ‌చ్చు.

Updated : 13 Dec 2021 16:47 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త చేకూర్చ‌డంలో జాతీయ పింఛ‌ను ప‌థ‌కం తోడ్ప‌డుతుంది. 18 నుంచి 70 సంవ‌త్స‌రాల‌ మ‌ధ్య వ‌య‌సు ఉన్న వ్య‌క్తులు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. ఎన్‌పీఎస్‌లో కొత్తగా ఖాతా తెర‌వాల‌నుకుంటున్నవారు ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ కేవైసి ప్రక్రియను పూర్తి చేసి ఈ-ఎన్‌పీఎస్ ద్వారా ఖాతా తెర‌వ‌చ్చు. ఈ-ఎన్‌పీఎస్ అనేది ఆన్‌లైన్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (సీఆర్ఏ) నిర్వ‌హించే ఆన్‌లైన్ ఎన్‌పీఎస్ ఆన్‌బోర్డింగ్ పోర్టల్. దీని ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను ఆన్‌లైన్‌లో ప్రారంభించ‌డంతో పాటు,  డిపాజిట్ కూడా చేయ‌వ‌చ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న చందాదారులు వారి టైర్ -2 ఖాతాను కూడా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం, ఈ-ఎన్‌పీఎస్ కింద నమోదు 'ఆధార్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసి' ద్వారా లేదా 'పాన్, బ్యాంక్ ఖాతా' ద్వారా జరుగుతుంది. 

ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ :
దీనికి యూఐడీఏఐ అందించిన ఆధార్ సంఖ్య లేదా 16-అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ (వీఐడీ) సంఖ్య, ఆధార్ న‌మోదిత మొబైల్ నంబర్ అవ‌స‌రం. 
ఈ-ఎన్‌పీఎస్‌లో ఆధార్ ఆధారిత కేవైసి నమోదు ప్రక్రియ:
*
ఆధార్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా తెరవడానికి, చందాదారులు ఇ-ఎన్‌పీఎస్ పోర్టల్ ఓపెన్ చేయాలి
*  అక్క‌డ “నేషనల్ పెన్షన్ సిస్టమ్” పై క్లిక్ చేసి, ఆపై “రిజిస్ట్రేషన్” ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* చందాదారులు ఇప్పుడు ఖాతా ప్రారంభించే కేట‌గిరీని ఎంచుకోవాలి - “వ్యక్తిగత చందాదారుడు” లేదా “కార్పొరేట్ చందాదారుడు”. ఇంకా, దరఖాస్తుదారుడి స్టేట‌స్‌ “సిటిజన్ ఆఫ్ ఇండియా” లేదా “నాన్-రెసిడెంట్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఐ)” లేదా “ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ)” నుంచి ఎన్నుకోవాలి.
* చందాదారులు రిజిస్ట్రేషన్ సమయంలో “ఆధార్ ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ కేవైసి” ఎంచుకోవాలి, ఖాతా తెరవడానికి ‘టైర్ రకాలను’ ఎంచుకోవాలి.
* ఇప్పుడు ఆధార్ లేదా వర్చువల్ ఐడీ నంబ‌ర్‌ల‌లో.. కావ‌ల‌సిన దాన్ని ఎంచుకోవాలి. త‌ర్వాత‌ జెనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఒకవేళ వర్చువల్ ఐడీ లేక‌పోతే, ముందు దానిని జెనరేట్ చేసుకోవాలి.
*  ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి.
* ఆధార్ వివరాలను ఉపయోగించడానికి సమ్మతితో పాటు ఓటీపీ సమర్పించిన తరువాత,  మీ పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో మొదలైన వివ‌రాల‌ను ఆధార్ రికార్డుల నుంచి సేక‌రిస్తారు.
* ఎన్‌పీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇతర తప్పనిసరి వివరాలను చందాదారుడు పూర్తి చేయాలి.
* పాన్ కార్డ్‌, ర‌ద్దు చేసిన చెక్ స్కాన్ చేసిన కాపీని *.jpeg/ *.jpg/ *.png /*.pdf ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 4 కేబి నుంచి 2 ఎమ్‌బి మ‌ధ్య‌న ఉండాలి. 
* మీ సంత‌కాన్ని *.jpeg/ *.jpg/ *.png ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫైల్ సైజ్ 4కేబి నుంచి 5ఎమ్‌బి మ‌ధ్య‌న ఉండాలి. 
* ఆ త‌ర్వాత‌ ఎన్‌పీఎస్‌కి కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేసి, డిజిటల్ ప్రామాణీకరణ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి (రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి వ‌చ్చే ఓటీపీ ద్వారా చేయ‌వ‌చ్చు).

పాన్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి కేవైసి మీరు ఎంచుకున్న బ్యాంక్‌/  లేదా నాన్‌-బ్యాంక్ పిఓపి ద్వారా పూర్తిచేస్తారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో అందించే పేరు, చిరునామా త‌దిత‌ర వివ‌రాలు పీఓపీ రికార్డుల‌లో కేవైసి వెరిఫికేష‌న్ కోసం ఇచ్చిన వివ‌రాల‌తో స‌రిపోలాలి. ఒక‌వేళ స‌రిపోల‌క పోతే మీ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌రించ‌బ‌డుతుంది. అటువంటి సంద‌ర్భంలో సంబంధిత‌ పీఓపీని సంప్ర‌దించాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని