Petrol Diesel GST: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తెస్తే ధర ఎంత తగ్గుతుంది?

పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పు రావచ్చని ప్రజలు నమ్ముతున్నారు.

Updated : 17 Sep 2021 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం లో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తేవడం గురించి ప్రతిపాదన పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పు రావచ్చని ప్రజలు నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని  గురించి రాష్ట్రాలతో ఎప్పటి నుంచో చర్చిస్తోంది. అయితే, అసలు ఎంత వరకు ధరలు తగ్గుతాయి, నష్టాలు ఏమైనా ఉన్నాయా ? వంటి విషయాలను చూద్దాం.

ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరల్లో పన్నులు ఎంత?

పెట్రోల్ బేస్ ధర రూ. 40 కి దగ్గరలో ఉంటుంది. దీని మీద వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి అనేక ఛార్జీలు రూ.60 కి పైగా ఉంటాయి. ఈ పన్నుల్లో కొంత కేంద్రానికి, కొంత రాష్ట్రాలకు చేరతాయి. దీంతో కొనుగోలు ధర పెట్రోల్ బంకు వద్ద ప్రస్తుతం రూ.100 దాటేసింది. ఇదే విధంగా డీజిల్ కూడా రూ.100 కి చేరువలో ఉంది. రాష్ట్రాల పన్నుల్లో వ్యత్యాసం ఉన్నందున ధరల్లో కూడా తేడా ఉంటోంది.

జీఎస్టీ కిందకి తెస్తే ఎంత తగ్గుతుంది?

జీఎస్టీ లో అనేక శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ గరిష్ఠ శ్లాబ్‌ అయినా 28 శాతం పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ని చేరిస్తే ధరలు ఎంత వరకు తగ్గుతాయి అనేది చూద్దాం! బేస్ ధర మీద 28 శాతం జీఎస్టీ అనుకున్నట్టయితే సుమారుగా రూ.11-12 అనుకోవచ్చు. దీనికి డీలర్ కమిషన్ రూ.3-4 జోడిస్తే, చివరిగా పెట్రోల్ ధర దాదాపు రూ. 55-56 వరకు తగ్గొచ్చు. అలాగే, డీజిల్ ధర దాదాపు రూ.50 వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా?

జీఎస్టీ లోకి పెట్రోల్, డీజిల్ ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించడమే అతి పెద్ద సమస్య. ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున కొన్ని రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలు ఏడాదికి రూ. 5 ల‌క్ష‌ల‌ కోట్ల వరకు వసూలు చేస్తుంటాయి. ఇందులో రాష్ట్రాల వాటా సుమారుగా రూ. 2 ల‌క్ష‌ల‌ కోట్లు. కొంత జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు తిరిగి వ‌చ్చినప్పటికీ ఇప్పటి పన్నులతో పోలిస్తే అది చాలా తక్కువనే చెప్పాలి.

జీఎస్టీ లోకి తేవడం వల్ల అనేక వస్తువుల, సేవల ధరలు తగ్గినట్టు మనం ఇది వరకే చూశాం. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ని కూడా ఇందులో చేరిస్తే సుమారుగా 50 శాతం వరకు ధరలు తగ్గవచ్చని మనకి తెలుస్తోంది. రాష్ట్రాలని ఒప్పించి కేంద్రం ఇలా తీసుకురాగలదా అనేది చూడాల్సి ఉంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు