PhonePe: పూర్తి భారతీయ కంపెనీగా ఫోన్‌పే.. ఫ్లిప్‌కార్ట్‌తో యాజమాన్య విభజన!

PhonePe: ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌పే రెండూ వేర్వేరు సంస్థలుగా మారాయి. ఈ మేరకు యాజమాన్య విభజన ప్రక్రియ పూర్తయింది. 

Updated : 23 Dec 2022 13:36 IST

దిల్లీ: వాల్‌మార్ట్‌ అధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) గ్రూపు.. తనలో భాగమైన ఫోన్‌పే (PhonePe) యాజమాన్య విభజనను పూర్తి చేసింది. దీంతో ఇకపై ఈ రెండు సంస్థలూ విడివిడిగా తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఐపీఓకి సన్నాహాలు చేసుకుంటున్న ఫోన్‌పే (PhonePe).. వచ్చే ఏడాది భారీ ఎత్తున నిధులను సమీకరించుకునే యోచనలో ఉంది. అదే జరిగితే భారత్‌లోనే అతిపెద్ద ఫిన్‌టెక్‌ అంకుర సంస్థగా అవతరించనుంది.

యాజమాన్య విభజన వల్ల ఇరు కంపెనీల ఎంటర్‌ప్రైజ్‌ విలువ పెరిగి వాటాదారులకూ ప్రయోజనం చేకూరుతుందని సంయుక్త ప్రకటనలో ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌పే వెల్లడించాయి. తాజా విభజన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం వాటాదారులుగా ఉన్న వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ‘ఫ్లిప్‌కార్ట్‌ సింగపూర్‌’, ‘ఫోన్‌పే సింగపూర్‌’.. ‘ఫోన్‌పే ఇండియా’లో నేరుగా వాటాలు కొనుగోలు చేశాయి. దీంతో ఫోన్‌పే పూర్తిగా భారత్‌కు చెందిన దేశీయ కంపెనీగా అవతరించింది. అక్టోబరులోనే ఈ సంస్థ తమ నమోదిత కార్యాలయాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించింది.

ఫోన్‌పే ప్రస్తుతం నిధుల సమీకరణ కోసం మాతృసంస్థ వాల్‌మార్ట్‌ సహా జనరల్‌ అట్లాంటిక్‌, ఇతర వాటాదారులతో చర్చలు జరుపుతోంది.700 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్లు సమీకరించే యోచనలో ఉంది. ఇదే జరిగితే ఫోన్‌పే విలువ రెండింతలై 12 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో రేజర్‌పే 7.5 బిలియన్‌ డాలర్లతో అతిపెద్ద ఫిన్‌టెక్‌గా ఉంది. నిధుల సమీకరణలో ఫోన్‌పే విజయవంతమైతే.. విలువపరంగా రేజర్‌పేను అధిగమిస్తుంది. ఈ నిధులతో ఫోన్‌పే తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్‌ పేకు గట్టిపోటీ ఇవ్వనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ పూర్వ ఉద్యోగులు సమీర్‌ నిగమ్‌, రాహుల్‌ చారి, బర్జిన్‌ ఇంజినీర్‌లు ఫోన్‌పేను స్థాపించారు. 2016లో ఈ సంస్థను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసింది. 2017లో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ ఇండియా చేజిక్కించుకుకోవడంతో ఫోన్‌పే కూడా అమెరికా సంస్థలో భాగమైంది. మ్యూచువల్‌ ఫండ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ లైసెన్సుల కోసమూ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వెల్త్‌డెస్క్‌, ఓపెన్‌క్యూ, గిగ్‌ఇండియా కంపెనీలను ఫోన్‌పే కొనుగోలు చేసింది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సును కలిగి ఉంది. ద్విచక్ర వాహనాలు, కార్లకు వాహన బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని