PhonePe నుంచి అకౌంట్‌ అగ్రిగేటర్‌ సేవలు.. ఎలా పనిచేస్తుంది?

PhonePe aggregator services: ఫోన్‌పే అకౌంట్‌ అగ్రిగేటర్‌ సేవలను ప్రారంభించింది. యూజర్ల అనుమతితో ఆర్థిక వివరాలను ఆర్థిక సంస్థలతో పంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఎలా పనిచేస్తుంది?

Published : 06 Jun 2023 17:56 IST

దిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (Phonepe) అకౌంట్‌ అగ్రిగేటర్‌ (Account aggregator) సర్వీసులను లాంచ్‌ చేసింది. ఫోన్‌పేకు చెందిన అనుబంధ సంస్థ ఫోన్‌పే టెక్నాలజీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (PTSPL) దీన్ని తీసుకొచ్చింది. ఈ సర్వీసుల ద్వారా యూజర్లు తమ ఆర్థిక వివరాలను బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలతో పంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌ను, సేవలను త్వరితగతిన పొందేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని ఫోన్‌పే తెలిపింది. 

కస్టమర్లు, ఆర్థిక సంస్థలు ఫైనాన్షియల్‌ డేటాను సులువుగా పంచుకునేందుకు ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ రూపొందించింది. ఇందులో భాగంగా 2021లో ఆర్‌బీఐ నుంచి ఫోన్‌పే అకౌంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ పొందింది. దీని కింద కొత్తగా రుణాలు తీసుకోవడం, ఇన్సురెన్స్‌ పాలసీల కొనుగోలు, పెట్టుబడి సలహాలు పంచుకోవడంలో ఆయా ఆర్థిక సంస్థలు వినియోగదారులకు సహాయపడతాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి 100కు పైగా ఆర్థిక సంస్థలతో ఫోన్‌పే జట్టుకట్టింది.

ఈ సేవలను పొందేందుకు ఫోన్‌పే యూజర్లు ముందుగా ఫోన్‌పే యాప్‌లో అకౌంట్‌ అగ్రిగేటర్‌ ఖాతాను క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత మీకున్న బ్యాంక్‌ ఖాతాలను లింక్‌ చేయాలి. ఒకసారి అన్ని ఖాతాలూ లింక్‌ చేసిన తర్వాత తమ ఫైనాన్షియల్‌ డేటాను ఆర్థిక సంస్థలతో పంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుమతిని తాత్కాలికంగా నిలుపుదల చేయడమో, పూర్తిగా ఉపసంహరించుకోవడమో చేయొచ్చని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీ రాహుల్‌ చారి తెలిపారు. ఆర్థిక వివరాలను పంచుకోవడం ద్వారా అవకాశాల ప్రపంచానికి ద్వారాలు తెరవొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఫోన్‌పే వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని