సొంతింటి కలకు.. గడువు పెంచుతారా?

తిండి.. బట్ట.. గృహవసతి ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన కనీస అవసరాలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, సొంతిల్లు అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. భారతదేశ

Updated : 30 Jan 2021 20:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తిండి.. బట్ట.. గృహవసతి ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన కనీస అవసరాలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, సొంతిల్లు అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. భారతదేశ జనాభాలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, కుటుంబాలే అధికం. అలాంటి వారికి తిండి, బట్టకు లోటు లేకపోయినా,  కోట్లాది కుటుంబాలు అద్దె ఇళ్లలో ఇరుకు గదుల్లో జీవితాన్ని గడిపేస్తున్నాయి. అలాంటి వారి సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న. సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు క‌ట్టుకోవడం/కొనుగోలు చేయడం ద్వారా సబ్సిడీపై గృహ రుణాన్ని పొందవచ్చు. అత్యధికంగా రూ.2.67లక్షల వరకూ రాయితీ పొందే అవకాశం ఉంది. కేవలం అత్యల్ప ఆదాయ వర్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనుకుంటే పొరపాటే, వార్షిక ఆదాయం రూ.18లక్షల వరకూ ఉన్న వాళ్లు కూడా ఈ పథకం కిందకు వస్తారు. 2022 నాటికి అత్యధికమందికి సొంతిల్లు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కరోనాతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం ఇచ్చేలా తాజా బడ్జెట్‌లో నిర్ణయాలు వెలువడతాయని అటు రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు, ఇటు సామాన్య జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పీఎంఈవై ఎలా పనిచేస్తుంది. ఎవరెవరికి వర్తిస్తుందో ఓసారి చూద్దాం!

నాలుగు కేటగిరీలకు మాత్రమే పీఎంఈవై

ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాలు(ఈడ‌బ్ల్యూఎస్‌), త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వ‌ర్గం, మధ్య ఆదాయ వర్గం-1(ఎంఐజీ-1), మధ్య ఆదాయం వర్గం2(ఎంఐజీ-2) అంటూ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు. వీరికి మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం వర్తిస్తుంది.

ఈడబ్ల్యూఎస్‌ వారికి షరతులు ఇవి..

వార్షిక కుటుంబ ఆదాయం రూ.0-3 లక్షల మ‌ధ్య ఉన్నవారు ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా బలహీన వర్గాలు) కిందకు వస్తారు. రూ.6 లక్షల గృహ‌రుణ వ‌డ్డీపై 6.50 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్రయోజ‌నం వ‌ర్తిస్తుంది. 30 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 322 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6 లక్షల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు.

త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వ‌ర్గం

వార్షిక కుటుంబ ఆదాయం రూ.3-6 లక్షల మ‌ధ్య ఉన్నవారు రూ.6 లక్షలపై గృహ‌రుణ వ‌డ్డీపై 6.5 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్రయోజ‌నం వ‌ర్తిస్తుంది. 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 646 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6లక్షల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు.తొలుత ఈ పథకాన్ని బ‌ల‌హీన వ‌ర్గాలు(ఈడ‌బ్ల్యూఎస్‌), త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వర్గాల వారికి వర్తింపజేశారు. ఆ తర్వాత మధ్య ఆదాయ వర్గం-1, 2లకు కూడా అందించారు.

ఎంఐజీ-1,2

వార్షిక కుటుంబ ఆదాయం రూ.6-12లక్షల మధ్య ఉన్న వారు రూ.9లక్షల గృహ రుణానికి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లు. వీటిలో ఏది తక్కువైతే ఆ కాలావధికి సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. 160 చదరపు మీటర్లు లేదా 1722 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉండాలి. ఇక వార్షిక కుటుంబ ఆదాయం రూ.12-18లక్షల మధ్య ఉన్న వారు రూ.12లక్షల వరకూ గృహరుణానికి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లు. 200 చదరపు మీటర్లు లేదా 2100 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉండాలి.

ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ కేటగిరీలు కిందకు వచ్చే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే చివరి తేదీ 31-03-2022గా నిర్ణయించారు. అంటే దాదాపు ఇంకా ఏడాది కాలం ఉంది. అదే ఎంఐజీ-1,2 కేటగిరీల వాళ్లకు 31-03-2021 తర్వాత ఈ పథకం వర్తించదు.

గడువు పెంచుతారా?

సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారంతా ప్రస్తుతం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే తొలి రెండు కేటగిరీల వారు ఈ పథకాన్ని పొందడానికి మరో ఏడాది సమయం ఉండగా, ఎంఐజీ-1,2 కేటగిరీల్లో ఉన్న వారికి రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మరి కొంత కాలం పొడిగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్రంగా పడింది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు సిమెంట్‌, ఉక్కు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకోవాలంటే బడ్జెట్‌లో కేటాయింపులు తప్పనిసరి. మరోవైపు ప్రజల ఆదాయం తగ్గడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు ప్రకటించడం, సబ్సిడీ మొత్తాన్ని పెంచడం వంటివి సామాన్యులకు మేలు చేసేవి. అదే విధంగా పీఎంఈవై పథకాన్ని మరికొంతకాలం పొడిగించడం ద్వారా ఈ రంగంపై ఆధారపడిన ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మరి సొంతింటి కల నెరవేర్చేందుకు నిర్మలమ్మ ఏ ప్రకటిస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 1వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!

ఇదీ చదవండి..

కట్టేది ఎక్కువ.. కట్టేవారు తక్కువ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని