PMSBY: ₹20 ప్రీమియంతో ₹2 లక్షల ప్రమాద బీమా.. సురక్షా బీమా యోజన పూర్తి వివరాలివే!
PMSBY full details in telugu: పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం కవర్ చేస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) అనేది ఒక సామాజిక భద్రతా పథకం. 2015 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇదీ ఒకటి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY)తో పాటు దీన్ని ప్రకటించారు. ఇంతకీ సురక్షా బీమా యోజన పథకం అంటే ఏమిటి? దీనికి అర్హులెవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం అండగా ఉంటుంది. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ఏటా దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
అర్హత..
- 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో చేరొచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి.
- ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది.
- ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరవచ్చు.
- ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి/నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు.
ప్రీమియం ఎంత, ఎలా చెల్లించాలి?
ఈ పథకానికి వర్తించే ప్రీమియంను ఇటీవలే ప్రభుత్వం ఏడాదికి రూ. 12 నుంచి రూ.20కి పెంచింది. దీంతో పాటు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రీమియంను కూడా పెంచింది. ఇంతకు ముందు పీఎంజేజేబీవై ప్రీమియం రూ.330 ఉండగా తాజాగా రూ.436కి పెంచింది. అంటే రెండు పథకాలకు కలిపి రోజుకి రూ.1.25 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు ఆటో డెబిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జూన్ 1 తర్వాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా పథకం అమలు అవుతుంది.
ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లైతే, క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లిస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంను కోల్పోవలసి ఉంటుంది. ప్రీమియం అనేది క్లెయిమ్ చేసిన దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే, ఊహించని ప్రతికూల ఫలితాలను మినహాయిస్తే మొదటి మూడేళ్లలో ప్రీమియంలో ఎటువంటి మార్పులూ ఉండవు. అలాగే, చందాదారులకు బ్యాంకులు పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్ను జారీచేయవు.
కవరేజ్ ఎంత?
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు.
గమనిక: చందాదారులు దీనిని అదనంగా ఏదైనా ఇతర బీమా పథకంతో కలిపి కవర్ చేసుకోవచ్చు. ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు. అందువల్ల ఈ పథకం ద్వారా మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులూ తిరిగిరావు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
బీమా ఎప్పుడు వర్తిస్తుంది?
సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.
పథకంలో ఎలా చేరాలి?
ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి పొందవచ్చు. బ్యాంకులు వారి చందాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ పథకంలో చేరడానికి, మీరు http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి మీ బ్యాంకులో అందించాలి. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ఆధారిత నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు.
ఆన్లైన్ ద్వారా పీఎంఎస్బీవైకి నమోదు చేసుకునే విధానం..
నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు.
- ముందుగా నెట్ బ్యాంకింగ్ లాగినయ్యి ఇన్సురెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఏ ఖాతాను ఉపయోగించి ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి.
- అన్ని వివరాలను తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవాలి. 'ఎక్నాలెజ్డ్మెంట్'ను డౌన్లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దీన్ని భద్రపరచుకోవాలి.
గమనిక: బ్యాంకు పొదుపు ఖాతాకు ఇచ్చిన నామినీనే ఇక్కడ సూచిస్తుంది. చందాదారుడు అదే నామినీని ఎంచుకోవచ్చు లేదా కొత్త నామినీని ఎంచుకోవచ్చు. ఇక్కడ సాధారణ ప్రాసెస్ను ఇవ్వడం జరిగింది. మీరు ఎంచుకున్న బ్యాంకును బట్టి దరఖాస్తు విషయంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు.
ఎప్పుడు రద్దవుతుంది?
కింది తెలిపిన వాటిలో ఏదైనా జరిగితే చందాదారుడి ప్రమాద కవరేజ్ ముగుస్తుంది.
- చందాదారుని వయసు 70 ఏళ్లు దాటినప్పుడు
- బ్యాంకు ఖాతాను మూసివేయడం లేదా బీమాను కొనసాగించేందుకు సరిపడా మొత్తం మీ ఖాతాలో లేకపోవడం.
- ఒకవేళ చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా పథకంలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నట్లైతే, బీమా కవర్ కేవలం ఒక ఖాతాకు మాత్రమే పరిమితం అయి మిగిలిన ఖాతాల ద్వారా చేసిన బీమా పాలసీలు రద్దవుతాయి.
క్లెయిమ్ కోసం ఏం చేయాలి?
ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లైతే PMSBY పథకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం వంటి మరణాలు సంభవించినట్లైతే వాటిని పోలీసులకు ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టు పై నుంచి కింద పడి చనిపోయినట్లైతే ఆ మరణాలను ఆసుపత్రి వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే, ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో, అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు చందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణం తాలూకా క్లెయిమ్లు నామినీ/చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు