Paytm: కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దు.. పేటీఎంకు ఆర్‌బీఐ సూచన

పేమెంట్‌ అగ్రిగేటర్‌ (PA) సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌కు ఆర్‌బీఐ (RBI) సూచించింది. అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది.

Published : 26 Nov 2022 15:40 IST

దిల్లీ: పేమెంట్‌ అగ్రిగేటర్‌ (PA) సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌కు ఆర్‌బీఐ (RBI) సూచించింది. అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందించింది. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది.

పేటీఎం బ్రాండ్‌తో వన్‌97 కమ్యూనికేషన్స్‌ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. పేమెంట్‌ అగ్రిగేటర్‌కు సంబంధించి ఆర్‌బీఐ గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అనుసరించి తన పేమెంట్‌ అగ్రిగేటర్‌ బిజినెస్‌ను.. పేటీఎం పేమెంట్‌ సర్వీసెస్‌కు బదిలీ చేయాలని ఆర్‌బీఐని కోరింది. అందుకు ఆర్‌బీఐ తిరస్కరించింది. దీంతో అవసరమైన పత్రాలను పేటీఎం గతేడాది సెప్టెంబర్‌లో మరోసారి ఆర్‌బీఐకి సమర్పించింది. తాజాగా పేటీఎంకు మరోసారి ఆర్‌బీఐ నుంచి సమాచారం వచ్చింది. పేమెంట్‌ అగ్రిగేటర్‌ వ్యాపారం నిర్వహించేందుకు 120 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అందులో సూచించింది. అనుమతులు పొందే వరకు కొత్త ఆన్‌లైన్‌ వ్యాపారులను చేర్చుకోవద్దని తమకు సూచించిందని ఆర్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేటీఎం తెలిపింది. దీనివల్ల తమ వ్యాపారంపై పెద్ద ప్రభావం  ఉండబోదని, ఆఫ్‌లైన్‌ వ్యాపారులను చేర్చుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని పేర్కొంది. అలాగే ఇప్పుడున్న ఆన్‌లైన్‌ వ్యాపారులతో వ్యాపారం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. త్వరలోనే సంబంధిత అనుమతులు లభిస్తాయని పేటీఎం ఆశాభావం వ్యక్తంచేసింది.

వివిధ పద్ధతుల ద్వారా ఇ-కామర్స్‌, వ్యాపారులకు వినియోగదారులు చెల్లింపులు చేస్తుంటారు. వ్యాపారులకు ప్రత్యేకమైన చెల్లింపుల వ్యవస్థంటూ అవసరం లేకుండా లావాదేవీలు పూర్తిచేయడానికి పేమెంట్‌ అగ్రిగేటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఇ-కామర్స్‌ సేవలతో పాటు, పేమెంట్‌ అగ్రిగేటర్‌ సేవలను ఒకే కంపెనీ అందించడానికి వీల్లేదు. అందుకు వేరే వ్యాపారంగా ఉండాలి. ఈ నేపథ్యంలో పేమెంట్‌ అగ్రిగేటర్‌ సేవలను.. పేటీఎం పేమెంట్‌ సర్వీసెస్‌కు బదిలీ చేయాలని వన్‌ 97 కమ్యూనికేషన్‌ ఆర్‌బీఐని కోరింది. మరోవైపు రోజర్‌పే, పైన్‌ ల్యాబ్స్‌, క్యాష్‌ఫ్రీ, సీసీ అవెన్యూస్‌ వంటివి ఇప్పటికే పేమెంట్‌ అగ్రిగేటర్‌ అనుమతులు పొందాయి. బిల్‌డెస్క్‌, పేయూ వంటివి ఆర్‌బీఐ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని