RBI: రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల జారీకి ఆర్‌బీఐ అనుమతి

RBI: విదేశాలకు ప్రయాణిస్తున్న భారతీయులకు అందుబాటులో ఉండే చెల్లింపుల వ్యవస్థను ఆర్‌బీఐ మరింత విస్తరించింది. అందులో భాగంగా రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

Published : 08 Jun 2023 12:44 IST

ముంబయి: కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఆర్‌బీఐ (RBI) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇ-రూపీ వోచర్ల జారీ, రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల జారీ వాటిలో ముఖ్యమైనవి.

పీపీఐలూ ఇ-రూపీ వోచర్లు జారీ చేయొచ్చు..

బ్యాంకింగేతర ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల (PPI) జారీదారులు సైతం ఇ-రూపీ వోచర్లను ఇచ్చేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. అలాగే ఇ-రూపీ జారీ, రిడెమ్షన్‌ను మరింత సులభతరం చేసేలా.. వీటిని వ్యక్తుల తరఫున కూడా జారీ చేసేందుకు అనుమతించింది. ఇ-రూపీ వోచర్ల ప్రయోజనాలను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ఆర్‌బీఐ తెలిపింది. తద్వారా డిజిటల్‌ చెల్లింపులు మరింత పుంజుకుంటాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఇ-రూపీని ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 11 బ్యాంకులు మాత్రమే జారీ చేస్తున్నాయి.

ఈ వ్యవస్థలో ఒక క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఇ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌..  వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.

రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులు..

విదేశాలకు ప్రయాణిస్తున్న భారతీయులకు అందుబాటులో ఉండే చెల్లింపుల వ్యవస్థను ఆర్‌బీఐ మరింత విస్తరించింది. విదేశాల్లోని ఏటీఎంలు, పీఓఎస్‌ మెషీన్లు, ఆన్‌లైన్‌ మర్చంట్ల వద్ద ఉపయోగించుకునేలా రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డు (RuPay Prepaid Forex cards)లను జారీ చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. అలాగే రూపే డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులను విదేశీ భూభాగాల్లోనూ జారీ చేసేందుకు అనుమతించింది. ప్రపంచవ్యాప్తంగా రూపే కార్డుల వినియోగం పెరుగుతుందని శక్తికాంతదాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని