Redmi Note 12: రెడ్‌మీ నోట్‌ 12 5జీపై డిస్కౌంట్‌.. ₹12,999కే స్మార్ట్‌ఫోన్‌!

Redmi Note 12 price slash: రెడ్‌మీ నోట్‌ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింది. ఎంపిక చేసిన క్రెడిట్‌కార్డులతో కొనుగోళ్లతో దీని ధర మరింత తగ్గనుంది.

Published : 02 Jun 2023 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన రెడ్‌మీ నోట్‌ 12 5జీ ధరను ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమి తగ్గించింది. రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+ 5జీతో పాటు రిలీజైన ఈ ఫోన్‌ ధరను తాజాగా ఆ కంపెనీ సవరించడంతో పాటు కొన్ని ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌, ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్లలో డిస్కౌంట్‌ ధరకే ఈ ఫోన్‌ లభిస్తుంది. కార్డు ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ధర అనంతరం ఈ ఫోన్‌ రూ.12,999కే లభించనుంది. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారు ఈ ఆఫర్‌ను పరిశీలించొచ్చు.

రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది జనవరిలో షావోమి విడుదల చేసింది. ఇందులో 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను అప్పట్లో రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. తాజాగా దీని ధరను కంపెనీ వెయ్యి రూపాయల మేర తగ్గించి రూ.16,999గా పేర్కొంది. అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ.2వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అదే ఎంఐ వెబ్‌సైట్‌లో అయితే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు లేదా ఐసీఐసీఐ నెట్‌ బ్యాంకింగ్‌తో కొనుగోలు చేస్తే రూ.2వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాత రెడ్‌మీ ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేసి ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.2వేలు కంపెనీ తగ్గింపు ఇస్తోంది. అంటే రెడ్‌మీ నోట్‌ 12 5జీ ఫోన్‌ రూ.12,999కే లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌+128జీబీ, 8జీబీ+ 256 జీబీ వేరియంట్లపైనా ఇదే తరహా డిస్కౌంట్‌ లభిస్తోంది.

రెడ్‌మీ నోట్‌ 5జీ ఫీచర్లు..

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12తో కూడిన ఎంఐయూఐ 13తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 4వ జనరేషన్‌ ప్రాసెసర్‌ అమర్చారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా, ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని