Credit Card: క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టే గడువు దాటిందా..? కంగారొద్దు..!

క్రెడిట్‌ కార్డు బిల్లు గడువు తేదీని మర్చిపోయినప్పుడు కార్డుదారులపై అదనపు భారం పడకుండా ఆర్‌బీఐ చిన్న వెసులుబాటు కల్పించింది.

Published : 12 Oct 2022 17:35 IST

ఆర్‌బీఐ ఏం చెబుతోందంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత అత్యవసరాలు ఎదురవడమో లేదా బిల్లు కట్టే చివరి తేదీ మర్చిపోవడమో.. కారణమేదైనా కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఆలస్యమవుతుంటాయి. అలా జరిగినప్పుడు ఆలస్య రుసుము, వడ్డీ వంటి అదనపు ఛార్జీలను భరించక తప్పదు. దీనికి తోడు సిబిల్‌ స్కోరు కూడా తగ్గుతుంది. మరి ఇలా గడువు తేదీ మర్చిపోయినప్పుడు కార్డుదారులపై అదనపు భారం పడకుండా ఏదైనా ఉపశమనం ఉందా? అంటే ఓ చిన్న వెసులుబాటు ఉందంటోంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). అయితే అది కేవలం మూడు రోజుల వరకు మాత్రమే..!

క్రెడిట్‌ కార్డుల వినియోగం విషయంలో ఆర్‌బీఐ ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా క్రెడిట్‌ కార్డు వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం క్రెడిట్‌ కార్డు జారీ చేసే సంస్థలు.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు ‘బకాయి పడిన రోజుల’(past Due) గురించి సమాచారమివ్వాలి. ఆ పాస్ట్‌ డ్యూ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఖాతాదారులపై ఛార్జీల వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అంటే, గడువు తేదీ లోపు మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకపోతే.. అప్పుడు మీ క్రెడిట్‌ కార్డు ఖాతాను ‘పాస్ట్‌ డ్యూ(బకాయి రోజులు)’గా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు రిపోర్ట్‌ చేసి, ఛార్జీలు విధిస్తుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం..  ‘బకాయి చెల్లించాల్సిన తేదీకి మూడు రోజుల తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతేనే.. ఆలస్య రుసుము, వడ్డీ వంటి ఛార్జీలను విధించాల్సి ఉంటుంది. అంటే బిల్లు కట్టే గడువు దాటినా కూడా.. మూడు రోజుల్లోపు ఎలాంటి ఛార్జీలు లేకుండానే కార్డుదారులు ఆ బిల్లును చెల్లించుకోవచ్చు. అయితే, మూడు రోజుల తర్వాత కార్డు బిల్లును చెల్లిస్తే గనుక.. ఆలస్య రుసుము ఛార్జీలను క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న గడువు తేదీ నుంచి లెక్కిస్తారు. అయితే, ఈ ఛార్జీలు కూడా కేవలం అవుట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ మీద మాత్రమే వేయాల్సి ఉంటుంది. అంతేగానీ, మొత్తం బాకీ మీద వసూలు చేయకూడదని ఆర్‌బీఐ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు