డిజిటల్.. మా బలం
రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ వల్ల రుణాలను ముందస్తుగా చెల్లించడంతో తమ బ్యాలెన్స్ షీట్లు మరింతగా పటిష్ఠమై, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మొత్తం అందుబాటులో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తమ మూడు అధిక వృద్ధి వ్యాపారాలైన
బ్యాలెన్స్ షీట్లూ పటిష్ఠం
ఆర్ఐఎల్ వార్షిక నివేదికలో ముకేశ్ అంబానీ
దిల్లీ: రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ వల్ల రుణాలను ముందస్తుగా చెల్లించడంతో తమ బ్యాలెన్స్ షీట్లు మరింతగా పటిష్ఠమై, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మొత్తం అందుబాటులో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తమ మూడు అధిక వృద్ధి వ్యాపారాలైన జియో, రిటైల్, చమురు- రసాయనాల వృద్ధి ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. డిజిటల్ విప్లవాన్ని విజయవంతంగా అందిపుచ్చుకునే సంస్థలదే భవిత అని వివరించారు. బుధవారం విడుదలైన ఆర్ఐఎల్ వార్షిక నివేదికలో ముకేశ్ ఏమన్నారంటే..
* 2020-21లో టెలికాం, డిజిటల్ వ్యాపారాల విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ (రూ.1,52,056 కోట్లు), రిలయన్స్ రిటైల్ సంస్థ (రూ.47,625 కోట్లు)ల్లో మైనార్టీ వాటాల విక్రయం ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు, ఇంధన రిటైలింగ్లో 49 శాతం వాటా విక్రయం ద్వారా రూ.7629 కోట్లను కంపెనీ సమీకరించింది. ఫలితంగా లక్ష్యం (2021 మార్చిలోగా) కంటే ముందుగానే రుణ రహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. ఆ ఏడాది ఆర్బీఐ నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని విదేశీ కరెన్సీ రూపంలోని 7.8 బిలియన్ డాలర్ల రుణాన్ని ముందుగానే చెల్లించేశాం. ఒక భారతీయ కార్పొరేట్ కంపెనీ ముందస్తుగా చెల్లించిన అత్యధిక రుణం ఇదే. ప్రపంచంలో గత పదేళ్లలో బ్యాంకింగేతర సంస్థల విభాగంలో జరిగిన అతి పెద్ద రైట్స్ ఇష్యూ కూడా మాదే. ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్కోకు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
* గత సంవత్సరం కొవిడ్-19 మహమ్మారి రూపంలో సవాళ్లు ఎదురైనా, ఆర్ఐఎల్ తన అన్ని వ్యాపార విభాగాల్లో వృద్ధి ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసింది.
* కొవిడ్-19పై పోరాటానికి ఆసుపత్రుల నిర్మాణంతో పాటు పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సరఫరా వంటివి చేస్తున్నాం. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలు డిజిటల్ సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాతో దేశానికి ఉపయోగపడ్డాయి.
సొంతంగా 5జీ సామర్థ్యాలు: దేశీయంగా 5జీ సొల్యూషన్లను క్వాల్కామ్తో కలిసి విజయవంతంగా పరీక్షించాం. 5జీ స్మార్ట్ఫోన్లపై డేటా వేగం 1 జీబీపీఎస్ మైలురాయిని చేరుకున్నాం. ప్రపంచ డిజిటల్ విప్లవం’లో భారత్ ముందు వరుసలో నిలిచేందుకు తగిన నెట్వర్క్ను జియో సిద్ధం చేసింది. తదుపరి 30 కోట్ల మంది మొబైల్ బ్రాడ్బ్యాంక్ వినియోగదార్లు, 5 కోట్ల ఫైబర్ గృహాలు, 5 కోట్ల ఎంఎస్ఎమ్ఈలకు సేవలందించే సామర్థ్యమూ ఉంది. ఇప్పటివరకు జియో 5000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టగా, 42.6 కోట్ల మంది చందాదార్లున్నారు.
* కొవిడ్-19తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 5 ఏళ్ల పాటు పూర్తి వేతనం ఇవ్వనున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రూ.10 లక్షల పరిహారానికి ఇది అదనమని వెల్లడించింది.వారి పిల్లల విద్యా ఖర్చులు డిగ్రీ వరకు భరిస్తామంది.
హోటళ్లలో విందు మందిరాలను టీకా కేంద్రాలుగా అనుమతించాలి
దిల్లీ: కార్పొరేట్ రంగ ఉద్యోగులకు సామూహికంగా టీకాలు వేసేందుకు హోటళ్లలోని విందు మందిరాలను (బాంక్వెట్ హాల్స్) టీకా కేంద్రాలుగా వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ద ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ నిబంధనల్లో మార్పులు చేయాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరినట్లు ఆతిథ్య పరిశ్రమ సమాఖ్య పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, సామాజిక భవనాల కంటే టీకాల కార్యక్రమానికి హోటళ్లలోని విందు మందిరాలు చాలా బాగుంటాయని సూచించామని ఎఫ్హెచ్ఆర్ఏఐ ఉపాధ్యక్షుడు గుర్బాక్షిష్ సింగ్ కోహ్లి వెల్లడించారు.
కొవిడ్తో సిబ్బంది మరణిస్తే పదేళ్లు మూల వేతనం చెల్లిస్తాం
ఏస్టర్ డీఎం హెల్త్కేర్కొచి: కొవిడ్-19తో తమ సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పదేళ్ల పాటు మూల వేతనం అందిస్తామని కార్పొరేట్ ఆసుపత్రుల సంస్థ ఏస్టర్ డీఎం హెల్త్కేర్ వెల్లడించింది. ఈ సంస్థకు 6 గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల్లో అతి పెద్ద నెట్వర్క్ ఉంది. భారత్లోనే అధికంగానే ఉన్నాయి. తమ సంస్థలో మొత్తం 2,880 మంది వైద్యులు, 6,300 నర్సులు, 11,000 మంది సిబ్బంది కొవిడ్పై పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఇందులో 5,150 మందికి కొవిడ్ సోకిందని, అయిదుగురు మృత్యువాత పడ్డారని తెలిపింది. వీరి కుటుంబ సభ్యులకు నెలవారీగా 10 ఏళ్లపాటు మూల వేతనం అందించనున్నామని ఏస్టర్ వ్యవస్థాపకులు-ఛైర్మన్, ఎండీ ఆజాద్ మూపెన్ వెల్లడించారు. ఇప్పటివరకు 28,000 మంది కొవిడ్ రోగులకు తమ ఆసుపత్రులు సేవలు అందించాయని, మధ్యప్రాచ్య దేశాలు, భారత్లో సుమారు 16.63 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.