Samsung: లీ జే యాంగ్‌కు శాంసంగ్‌ పగ్గాలు.. జైలు నుంచి విడుదలైన 2 నెలలకు బాధ్యతలు

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా లీ జే యాంగ్‌ నియమితులయ్యారు. 2020లో తండ్రి మరణానంతరమే లీ శాంసంగ్‌ పగ్గాలు చేపట్టాల్సిన ఉన్నప్పటికీ.. లంచం కేసులో దర్యాప్తు, జైలు శిక్ష కారణంగా ఆలస్యమైంది.

Published : 27 Oct 2022 17:22 IST

సియోల్‌: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ (Samsung) ఎలక్ట్రానిక్స్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా లీ జే యాంగ్‌ (54) (Lee Jae-yong) నియమితులయ్యారు. ఈ మేరకు శాంసంగ్‌ బోర్డు అంగీకారం తెలిపింది. వాస్తవానికి 2020లో తండ్రి మరణానంతరమే లీ శాంసంగ్‌ పగ్గాలు చేపట్టాల్సిన ఉన్నప్పటికీ.. లంచం కేసులో దర్యాప్తు, జైలు శిక్ష కారణంగా ఆలస్యమైంది. దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలైన లీ.. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీ పగ్గాలు చేపట్టారు.

శాంసంగ్‌ ఛైర్మన్‌గా లీ జే యాంగ్‌ చాలా కీలక సమయంలో బాధ్యతలు చేపట్టారు. ఓ వైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచడం వంటి చర్యలతో టెక్నాలజీ డివైజుల కొనుగోళ్లు తగ్గాయి. దీంతో కంపెనీ లాభాలు క్షీణించాయి. లీ బాధ్యతలు చేపట్టిన రోజే కంపెనీ ఫలితాలు సైతం వెలువడ్డాయి. గతేడాదితో పోలిస్తే కంపెనీ లాభం 31 శాతం క్షీణించడం గమనార్హం. ఛైర్మన్‌గా నియమితులైన సందర్భంగా లీ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పరిస్థితులకు అనుగుణంగా వేగవంతమైన, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

లీపై కేసు ఇదీ..

లీ జే యాంగ్‌.. శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌ హీ పెద్ద కుమారుడు. లంచం కేసులో 2017లో అరెస్టయ్యారు. శాంసంగ్‌‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అనంతరం కేసును విచారించిన న్యాయస్థాం జే యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత అప్పటి పార్క్‌ గ్వెన్‌ ప్రభుత్వం కూలిపోయింది. అయితే తనకు విధించిన శిక్షపై జే యాంగ్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరగా.. లీ జే యాంగ్‌కు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే క్షమాభిక్ష పెట్టడంతో జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని