సురక్షితమైన UPI లావాదేవీలకు SBI టిప్స్‌

యూపీఐతో సులభంగా సురక్షితంగా రియల్‌ టైమ్‌లో చెల్లింపులు చేయవచ్చు. 

Updated : 28 Sep 2022 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI).. రియల్‌ టైమ్‌ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు, ఒకే ఒక్క యాప్‌తో.. మొబైల్‌ నంబరు, క్యూఆర్‌ కోడ్‌ సాయంతో క్షణాల్లో నగదు బదిలీ, చెల్లింపులు చేసేయొచ్చు. ఇందుకోసం ఎటువంటి ఛార్జీలూ చెల్లించనవసరం లేదు. 

2016లో యూపీఐ ప్రారంభమైనప్పటికీ కొవిడ్‌-19 కారణంగా గత రెండేళ్లలోనే భారత్‌లో యూపీఐ చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం జులైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే అప్పటి వరకు నమోదైన అత్యధిక లావాదేవీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పుడు ఆగస్టులో రూ.10.70 లక్షల కోట్ల మేర యూపీఐ లావాదేవీలు పెరిగాయి. సమయం, శక్తి, పేపర్‌ వినియోగాన్ని తగ్గించడం కూడా లావాదేవీలు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 

రోజు రోజుకీ లావాదేవీల సంఖ్య పెరగడంతో పాటు.. మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు అనేక కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు కూడా లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి మోసాలకు చెక్‌ పెట్టి యూపీఐ ద్వారా సురక్షితంగా లావాదేవీలు నిర్వహించేందుకు కొన్ని చిట్కాలను తెలుపుతూ ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

యూపీఐ లావాదేవీలు సురక్షితంగా ఉండాలంటే..?

  • డబ్బును స్వీకరించే సమయంలో యూపీఐ పిన్‌ నంబరును నమోదు చేయనవసరం లేదు.
  • యాదృచ్ఛిక/తెలియని సేకరణ అభ్యర్థనను అంగీకరించవద్దు.
  • మీ యూపీఐ పిన్‌ నంబరు ఎవ్వరికీ చెప్పొద్దు.
  • ఫోన్ నంబర్‌ ద్వారా లేదా క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసేటప్పుడు.. లబ్ధిదారుని వివరాలను ధ్రువీకరించిన తర్వాత మాత్రమే చెల్లింపులు చేయడం మంచిది. 
  • మీ యూపీఐ పిన్‌ నంబర్‌ తరచుగా మారుస్తూ ఉండడం మంచిది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు