Budget 2022: బడ్జెట్లో సీనియర్ సిటిజన్లు ఏం కోరుకుంటున్నారు?
ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో పోలిస్తే ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగింది. ముఖ్యంగా కొవిడ్ సంబంధిత చికిత్సలు, తద్వారా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలకు చాలా ఖర్చవుతోంది. దీని ప్రభావం సీనియర్ సిటిజన్లపై ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (ఫిబ్రవరి 1న) పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్ పరిణామాల దృష్ట్యా తమకు అనుకూలమైన ప్రతిపాదనలు ఉంటాయని సీనియర్ సిటిజన్లు అంచాన వేస్తున్నారు. ఇంతకీ బడ్జెట్ నుంచి సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రాథమిక పన్ను మినహాయింపు పెంపు
సీనియర్ సిటిజన్ల ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. సీనియర్ సిటిజన్లు రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ పౌరుల మినహాయింపు పరిమితి పెంచకపోయినా సీనియర్ సిటిజన్ల పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిమితిని సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.6 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
సెక్షన్ 80సీ
ఆదాయపు పన్ను 1961 చట్టంలోని సెక్షన్ 80సీ కింద నిర్ధిష్ట పన్ను ఆదా పెట్టుబడులపై రూ.1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అందరికీ కాకపోయినా, కనీసం సీనియర్ సిటిజన్లకు, వారి వడ్డీ/పెన్షన్ ఆదాయం నుంచి పన్ను భారాన్ని తగ్గించుకునేందకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు
అలాగే సెక్షన్ 80డీ కింద సొంత బీమాతో భార్య, పిల్లలు, తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై మినహాయింపు లభిస్తుంది. కొవిడ్ -19 కారణంగా, సీనియర్ సిటిజన్ల వైద్య బిల్లులు భారీగా పెరిగాయి. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మిగిలిన వయసు వారితో పోలిస్తే, 60 ఏళ్లు, ఆపై వారికి ప్రమాదం ఎక్కువగానే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.50 వేల వరకు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయ్యివుండి.. అతడి/ఆమె తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే తల్లిదండ్రుల కోసం చెల్లించే వైద్య బీమా ప్రీమియంతో కలిపి రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందొచ్చు. అయితే, సీనియర్ సిటిజన్ తన కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందే అవకాశం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. అలాగే, కొవిడ్ సంబంధిత ఆసుపత్రి ఖర్చుల కోసం సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80డీడీబీ కింద రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపు అనుమతించాలని నిపుణులు భావిస్తున్నారు. సెక్షన్ 80డీడీబీ పేర్కొన్న వ్యాధుల చికిత్సకయ్యే వైద్య ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది.
సెక్షన్ 80టీటీబీ..
సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీబీ కింద బ్యాంక్/పోస్టాఫీసు డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయంపై రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు, వారి పెట్టుబడుల కోసం బ్యాంకులు వంటి సురక్షిత మార్గాలనే ఎంచుకోవాలి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులు తమ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. దానికి పన్నులు కూడా తోడైతే రాబడి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో వారికి లభించే వడ్డీలో ఎక్కువ మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ మినహాయింపును కనీసం రూ.లక్ష వరకు పెంచాలి.
ఎస్సీఎస్ఎస్ పెట్టుబడులపై పూర్తి మినహాయింపు ఇవ్వాలి..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పెట్టుబడులపై వచ్చిన వడ్డీ ఆదాయం ప్రస్తుతం పన్ను పరిధిలోకి వస్తోంది. స్థిర ఆదాయాన్ని ఇచ్చే పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి. రాబడిపై పన్ను ఈ పథకాల ప్రయోజనాన్ని మరింత తగ్గిస్తుంది. 2022 బడ్జెట్లో ప్రభుత్వం ఎస్సీఎస్ఎస్ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని పూర్తి పన్ను రహితంగా చేయాలని పెన్షనర్లు కోరుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడుల కోసం తక్కువ రిస్క్ ఉన్న పథకాలను ఎంచుకోవడం అవసరం. అందువల్ల ఎస్సీఎస్ఎస్ పథకానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ పథకానికి పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది.
యాన్యుటీ విషయంలో..
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్/యాన్యుటీలకు వర్తించే పన్ను ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు షేర్లుకు వర్తించే పన్ను భిన్నంగా ఉంటుంది. ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే రాబడిపై మాత్రమే పన్ను వర్తిస్తుంది. అసలుపై వర్తించదు. యాన్యుటీ ఉత్పత్తులపై విషయంలో సీనియర్ సిటిజన్లు పొందిన యాన్యుటీ ఆదాయానికి, వారికి వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. పెన్షన్ కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకుంటే.. 40 శాతం నిధిని పన్ను రహితంగా పరిగణిస్తారు. కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకోకపోతే మొత్తం పెన్షన్పై పన్ను వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఎక్కువ శాతం కమ్యూటెడ్ పెన్షన్ను తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ పదవీ విరమణ తరువాత యాన్యూటీ రూపంలో తీసుకునే అన్కమ్యూటెడ్ పెన్షన్ను పన్ను రహితం చేస్తే, పదవీ విరమణ తరువాత రోజువారీ ఖర్చులను సులభంగా అధిగమించే విధంగా పెన్షన్ ప్లాన్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM