సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం గ‌డువు పెంచిన బ్యాంకులు..

సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను (బీపీఎస్‌) అందిస్తాయి. ప్ర‌త్యేక ఎఫ్‌డీ స్కీమ్ దానిపైన అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుంది.

Published : 29 Jun 2021 14:14 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,  బీఓబీ బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అందిస్తున్న స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను సెప్టెంబ‌రు 30,2021 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కోవిడ్-19 నేప‌థ్యం, బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ప‌డిపోతుండ‌టంతో సీనియ‌ర్ సిటిజ‌న్ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు గత సంవ‌త్స‌రం ‘మే’ లో ఈ ప‌థకాన్ని ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు ప్రారంభించాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)..
సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం "ఎస్‌బీఐ వీకేర్" ప్ర‌త్యేక డిపాజిట్  ప‌థ‌కాన్ని ప్రారంభించింది. సాదార‌ణంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ల‌భిస్తుంది. సాధార‌ణ‌ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అద‌న‌పు వ‌డ్డీ రేటు అందిస్తుంది.  ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా,  సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.20శాతం వ‌డ్డీ అందిస్తుంది. ఈ రేట్లు జ‌న‌వ‌రి8, 2021 నుంచి అందుబాటులో ఉన్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..
"హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్" పేరుతో స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల అద‌నంగా ఆఫ‌ర్ చేస్తుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కంటే 75 బేసిస్ పాయింట్లు మేర‌ అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఈ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుతం వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..
సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ డిపాజిట్ల‌పై 100 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ అందిస్తుంది. ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కం కింద (5 సంవ‌త్స‌రాల నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు) ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే, ఎఫ్‌డీకి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది.

చివ‌రిగా..
సాధార‌ణ ఎఫ్‌డి ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను (బీపీఎస్‌) అందిస్తాయి. ప్ర‌త్యేక ఎఫ్‌డీ స్కీమ్ దానిపైన అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుంది. వడ్డీ రేట్లు త‌క్క‌వ‌గా ఈ స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ద్వారా ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తున్నప్ప‌టికీ,  5 సంవత్సరాల సుదీర్ఘ కాలం డబ్బును లాక్ చేయ‌డం మంచి ఆలోచన కాద‌ని నిపుణ‌ల అభిప్రాయం.

వీటి స్థానంలో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌,  లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ వ‌యో వంద‌న యోజ‌న కూడా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎంచుకోవ‌చ్చు. వ‌డ్డీ రేట్లు దిగువ‌న ఉన్న‌ ఈ స‌మ‌యంలో ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ఎంచుకోవ‌డం ద్వారా కూడా అధిక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌చ్చు.

పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ ప‌థ‌కం 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియ‌డ్‌తో వ‌స్తుంది.  ప్రస్తుత వ‌డ్డీ రేటు 7.4శాతం.  ఇది బ్యాంక్ ఎఫ్‌డిపై అందిస్తున్న వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ ప‌థ‌కంలో గరిష్టంగా రూ.15 ల‌క్షల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎలాంటి గ‌రిష్ట ప‌రిమితి లేదు. ముంద‌స్తు విత్‌డ్రాల‌పై రెండింటిలోనూ పెనాల్టీ విధిస్తారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని