Fixed Deposits: సీనియ‌ర్ సిటిజ‌న్స్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌.. ఇంకొన్ని రోజులే!

బ్యాంకులు 0.50% అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుండ‌గా, ఈ స్పెష‌ల్ డిపాజిట్లు అంత‌కు మించిన వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నాయి

Published : 25 Mar 2022 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో మ‌దుపు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కచ్చిత‌మైన వ‌డ్డీ ఆదాయం, న‌ష్ట‌ భ‌యం త‌క్కువ‌గా ఉండ‌డమే ఇందుకు కారణం. అయితే, 2020లో క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా వ‌డ్డీ రేట్లు భారీగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఊర‌టనిచ్చేందుకు ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐతో పాటు మ‌రికొన్ని బ్యాంకులు అధిక వ‌డ్డీ రేట్ల‌తో ప్ర‌త్యేక‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను తీసుకొచ్చాయి. చాలా వ‌ర‌కు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ రేటును అందిస్తుండ‌గా.. ఈ స్పెష‌ల్ డిపాజిట్లు అంత‌కు మించిన వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను ప‌రిమిత కాల‌వ్య‌వ‌ధితో అందిస్తున్నాయి బ్యాంకులు. వీటి గ‌డువు త్వ‌ర‌లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో 5 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమ‌తితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌నుకునే సీనియ‌ర్ సిటిజ‌న్లు వాటి గ‌డువు తేదీలను తెలుసుకుని త్వ‌ర‌ప‌డ‌డం మంచిది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ అందించే స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌లు, వాటి ముగింపు తేదీల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ): సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ‘ఎస్‌బీఐ వీ కేర్’ పేరుతో ప్ర‌త్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాన్ని 2020 మే నెలలో ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది. సాధార‌ణ‌ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) అద‌న‌పు వ‌డ్డీ రేటు బ్యాంక్‌ అందిస్తోంది. ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.30 శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా..  సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.10 శాతం వ‌డ్డీ అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఎస్‌బీఐ అందిస్తున్న ‘ఎస్‌బీఐ వీకేర్’ ప్లాన్ 2022 సెప్టెంబర్‌ 30 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ‘హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్’ పేరుతో స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల అద‌నంగా ఆఫ‌ర్ చేస్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌ కంటే 75 బేసిస్ పాయింట్ల మేర‌ అధిక వ‌డ్డీ రేటును ఇస్తోంది. ఈ ప‌థ‌కాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2020 మే 18న ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో గ‌డువు ముగియ‌నుంది. ఈ ప‌థ‌కం 5 ఏళ్ల కాల‌ప‌రిమితితో కొత్త‌గా చేసే డిపాజిట్లు, పున‌రుద్ధ‌ర‌ణ‌ల‌పై మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఎన్నారైలకు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు.

ఐసీఐసీఐ బ్యాంక్ స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌: సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్, గోల్డెన్‌ ఇయ‌ర్స్ పేరుతో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం 2020 మే 20న తీసుకురాగా.. 2022 ఏప్రిల్‌ 8 వరకు అందుబాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 5 సంవ‌త్స‌రాల 1 రోజు కాల‌ప‌రిమితితో కూడిన‌ రూ.2 కోట్లలోపు డిపాజిట్ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 75 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీని ఈ పథకం కింద అందిస్తున్నారు.

సీనియ‌ర్ సిటిజ‌న్లు.. వీటి స్థానంలో సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌, ఎల్ఐసీ వ‌య వంద‌న యోజ‌న, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌, ఫ్లోటింగ్ రేట్ బాండ్లను ఎంచుకోవ‌చ్చు.

స్పెష‌ల్ డిపాజిట్ స్కీమ్‌ల కంటే ఎక్కువ వ‌డ్డీ రేటు అందిస్తున్న ప‌థకాలు, వ‌డ్డీ రేట్లు..

  • సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్...7.40 శాతం
  • పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్...6.60 శాతం
  • 5 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్...6.70 శాతం
  • ధాన‌మంత్రి వ‌య వంద‌న యోజ‌న...7.40 శాతం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని