Stock market: రెండ్రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో సూచీలు

Stock market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 377 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్ల లాభాలతో ముగిశాయి.

Updated : 08 Feb 2023 16:20 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో రెండ్రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఊహించినట్లుగానే ఆర్‌బీఐ (RBI) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం, అదానీ ఎంటర్‌ ప్రైజెస్, పేటీఎం, రిలయన్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. ఐటీ, ఫార్మా, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో సెన్సెక్స్‌ 377 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 17,850 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.50గా ఉంది.

ఉదయం 60,332.99 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్‌ ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 500కు పైగా పాయింట్ల లాభంతో 60,792 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 377.75 పాయింట్ల లాభంతో 60,663.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్ల లాభంతో 17,871.70 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌ షేర్లు షేర్లు రాణించగా.. ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి.

  • పెరిగిన బంగారం: దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి రూ.335 పెరిగి రూ.57,463కి చేరింది. వెండి సైతం కిలో రూ.516 పెరిగి రూ.68,075కు చేరింది. అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల పెరుగుదల వల్లే దేశీయంగా ధరలు పెరిగినట్లు అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1880 డాలర్ల వద్ద, ఔన్సు వెండి 22.45 వద్ద ట్రేడవుతున్నాయి. 
  • పేటీఎం జూమ్‌: చాలా రోజుల తర్వాత పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ భారీ లాభాలు చవిచూసింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో NSEలో కంపెనీ షేరు ఏకంగా 15 శాతం ఎగిసి రూ.91.40 లాభంతో రూ.680 వద్ద ముగిసింది. కంపెనీ నష్టాలు తగ్గడం, ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మాక్వరీ పేటీఎం టార్గెట్‌ ప్రైస్‌ను సవరించడంతో వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసింది.
  • అదానీ విల్మర్‌ లాభం 15 శాతం: అదానీ విల్మర్‌ క్యూ3 ఫలితాల్లో 15 శాతం లాభాన్ని నమోదు చేసింది. దీంతో అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.246.11 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.211.41 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ.14,398.08 కోట్ల నుంచి రూ.15,515.55 కోట్లకు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు