Sensex@60K: 60 వేలు దాటిన సెన్సెక్స్‌.. రెండు నెలల్లో ఎంత మార్పో!

Sensex@60K: సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ సెన్సెక్స్‌ పుంజుకుంది. 60వేల మార్కును అందుకుంది.

Updated : 29 Aug 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూన్‌ 17.. సరిగ్గా రెండు నెలల క్రితం. 40 ఏళ్ల గరిష్ఠానికి అమెరికా ద్రవ్యోల్బణం చేరడం.. వడ్డీ రేట్ల పెంపు భయాలు.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు.. వెరసి మన మార్కెట్లు కుదేలయ్యాయి. కొవిడ్‌ తర్వాత భారీగా పుంజుకుని 60 వేల మార్కు దాటిన సెన్సెక్స్‌కు నష్టాలు పోటెత్తాయి. దీంతో జూన్‌ 17న 50,921 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌ 52 వారాల కనిష్ఠానికి చేరింది. సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి మళ్లీ సెన్సెక్స్‌ పుంజుకుంది. ఆగస్టు 17న మళ్లీ 60 వేల మార్కును అందుకుంది. ఈ రెండు నెలల్లో ఇంతకీ ఏం మారింది?

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత కొన్ని రోజులుగా వరుస లాభాలు ఆర్జిస్తున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే పునరావృతమైంది. ఆసియా మార్కెట్లతో పాటు సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బుధవారం 60వేల మార్కును అందుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 417.92 పాయింట్ల లాభంతో 60,260.13 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 119 పాయింట్లు లాభపడి 17,944.25 వద్ద స్థిరపడింది.

తగ్గిన ద్రవ్యోల్బణ భయాలు

అటు అమెరికాతో పాటు, దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లను వణికించాయి. దీంతో సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అటు రిటైల్‌ ద్రవ్యోల్బణంతో పాటు, టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. మరోవైపు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం కాస్త అదుపులోకి రావడంతో వడ్డీ రేట్ల పెంపు విషయంలో సెంట్రల్‌ బ్యాంకులు మునుపటి దూకుడును కనబరచకపోవచ్చన్నది అంచనా. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విదేశీ మదుపరులు తిరిగొచ్చారు

ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్ల పతనానికి మరో కారణం విదేశీ సంస్థాగత మదుపరులు (FPI) మన మార్కెట్లను వీడడం. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్య దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సంపదను మన మార్కెట్ల నుంచి వారు తరలించారు. అయితే, విదేశీ మదుపరులు మళ్లీ మన మార్కెట్లవైపు చూస్తుండడం మార్కెట్ల ర్యాలీకి దోహదం చేస్తోంది. జులైలో రూ.5 వేల కోట్ల ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలోకి రాగా.. ఒక్క ఆగస్టు నెలలో ఇప్పటి వరకు రూ.23,800 కోట్లు ఎఫ్‌ఐపీలు వచ్చాయి. దీనికి రిటైల్‌ సంస్థాగత మదుపరులు తోడవ్వడం 60వేల మార్కును చేరుకోవడానికి దోహదం చేశాయి.

ఈ షేర్లు రాణించాయి..

ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 షేర్లు భారీగా రాణించాయి. దాదాపు 20 నుంచి 35 శాతం మేర పెరిగాయి. వీటిలో అత్యధికంగా ఏషియన్‌ పెయింట్స్‌ బాగా రాణించింది. రెండు నెలల క్రితం ఈ షేరు విలువ రూ.2,583 ఉండగా.. నేడు రూ.3,500 స్థాయికి చేరింది. అంటే దాదాపు 35 శాతం పెరిగింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు సైతం అదే స్థాయిలో రాణించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌ కంపెనీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు 25 నుంచి 29 శాతం మేర లాభపడగా.. టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ షేర్లు సైతం 20 నుంచి 25 శాతం మేర రాణించాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ల ర్యాలీ కొనసాగొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని