Stock Market: మార్కెట్లకు ఫెడ్ ఎఫెక్ట్.. తీవ్ర ఊగిసలాటలో మార్కెట్లకు భారీ నష్టాలు
‘ఫెడ్’ నిర్ణయం దలాల్ స్ట్రీట్ను కుదిపేసింది. మదుపర్లను బెంబేలెత్తించింది. సూచీలను తీవ్ర ఊగిసలాటలోకి నెట్టేసింది. వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్
ముంబయి: ‘ఫెడ్’ నిర్ణయం దలాల్ స్ట్రీట్ను కుదిపేసింది. మదుపర్లను బెంబేలెత్తించింది. సూచీలను తీవ్ర ఊగిసలాటలోకి నెట్టేసింది. వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావమే చూపించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 17వేల మార్క్ దిగువకు పడిపోయింది. అయితే చివర్లో బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ.. భారీ నష్టాలు తప్పలేదు.
సూచీల పయనం సాగిందిలా..
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ను ప్రారంభించిన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల వరకు పడిపోయింది. ఈ ఉదయం 57,317 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. ఒక దశలో 56,439 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. అంటే దాదాపు 1,450 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయ్యింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు కాస్త కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. అయినప్పటికీ నష్టాలు తప్పలేదు. మొత్తానికి నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 581.21 పాయింట్లు దిగజారి 57,276.94 వద్ద స్థిరపడింది.
అటు నిఫ్టీ కూడా తీవ్రంగానే ఊగిసలాడింది. 17,062 వద్ద ట్రేడింగ్ను మొదలుపెట్టిన సూచీ.. ఒక దశలో 16,866.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకుని 167.80 పాయింట్ల నష్టంతో 17,110.15 వద్ద ముగిసింది.
మెరిసిన బ్యాంకింగ్ సూచీ..
సూచీల కనిష్ఠాల వద్ద కొన్ని రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. ఈ రంగ సూచీ 5 శాతం మేర ఎగబాకింది. అటు ఆటోమొబైల్ సూచీ కూడా 1శాతం వరకు పెరిగింది. కాగా.. రియల్టీ, ఫార్మా, ఐటీ రంగ షేర్లు మాత్రం కుదేలయ్యాయి. ఈ సూచీలు 1 - 3 శాతం కుంగాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మారుతి సుజుకీ, కొటక్ మహీంద్రా షేర్లు లాభపడగా.. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టీసీఎస్, విప్రో షేర్లు నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే..
అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం..
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడ్డాయి. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి బలంగానే ఉందని, అందువల్ల వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ఏడాది మార్చిలో రేట్ల పెంపు 0.25శాతం ఉండొచ్చని సూచనప్రాయంగా వెల్లడించింది. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా దేశీయ సూచీలు కూడా భారీగా నష్టపోతున్నాయి.
చమురు ధరల మంట..
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత వేడెక్కుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర నిన్న 90 డాలర్లు దాటింది. మరికొద్ది రోజుల్లో 100 డాలర్లను చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీయంగానూ ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
బడ్జెట్పై అప్రమత్తత..
మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును మరింత పెంచే అవకాశాలున్నట్లు కొద్ది రోజులుగా వస్తోన్న వార్తలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులకు ఈ పన్ను 10శాతంగా ఉంది.
త్రైమాసిక ఫలితాలు..
డిసెంబరు త్రైమాసికానికిగానూ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే వీటిల్లో చాలా వరకు మదుపర్ల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ