Budget 2023: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది!

నిర్మలా సీతారామన్‌ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది.

Published : 01 Feb 2023 13:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్‌ (Budget 2023)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దు (Budget 2023)ను ఆమె ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. ఇదే కాదు.. గత నాలుగేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తోన్న నిర్మలమ్మ (Nirmala Sitharaman).. పద్దు విషయంలో పలు కొత్త సంప్రదాయాలకు తెరతీశారు.

నిర్మలమ్మ ప్రసంగాల్లో ఇదే చిన్నది..

నిర్మలా సీతారామన్‌ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. ఈసారి ఆమె దేశ పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) పార్లమెంటు వేదికగా ప్రజల ముందుంచారు.

2 గంటల 42 నిమిషాలు..

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం (Budget Speech) చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌ సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు.

అరుదుగా ఐదోసారి..

2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. తద్వారా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ.. ఎక్కువసార్లు పద్దును ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన రికార్డు తన పేరిట లిఖించారు.

అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్‌లు..

1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్‌ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్‌ ముల్జీ భాయ్‌ పటేల్‌ సమర్పించిన బడ్జెట్‌ అతిచిన్నది. కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు