Rs 2000 Notes: మీ అనుభవానికి తగినట్లుగా సూచనలు చేయండి.. చిందబరంపై సీతారామన్‌ ఫైర్‌!

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆయన అనుభవానికి తగినట్లుగా సూచనలు చేస్తే బావుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ. 2వేల నోటు ఉపసంహరణపై ఆయన చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. 

Published : 30 May 2023 01:48 IST

ముంబయి:  రూ.2వేల నోటు ఉపసంహరణపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం (P Chidambaram)వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఖండించారు. ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2వేల నోటు రద్దుకు గల కారణాన్ని ఆర్‌బీఐ (RBI) ఇప్పటికే వివరించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. 

‘‘పదేళ్లపాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆయనే ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మేము పార్లమెంట్‌లో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాం. కానీ, ఒక్క ప్రశ్నకు అప్పటి అధికారపక్షం సరైన సమాధానాలు చెప్పలేదు. మీరు గతంలో నిర్వహించిన పదవి, అనుభవానికి తగినట్లుగా ఏవైనా అంశాలను పరిశీలించి సూచనలు చేసి ఉంటే బాగుండేది. కానీ, మీరు ఇతరుల నిర్ణయాలపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2వేల నోటు చలామణీని ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే వెల్లడించింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత నగదు చలామణీ కోసం రూ.2వేల నోటును తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరడంతో వాటిని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిని మనమంతా అర్థం చేసుకోవాలి’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 

అంతకుముందు, రూ.2వేల నోటు ఉపసంహరణ భారత దేశ నగదు చలామణీపై అనుమానాలు కలిగిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబంరం వ్యాఖ్యానించారు. ప్రధాన ఆర్థిక సూచీలు సైతం తిరోగమనాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. నగదు అనేది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని, వాటిని ఉపసంహరించుకోవడం అనేది ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని ఆర్‌బీఐ, కేంద్రం అనుసరిస్తున్నాయని మంత్రి తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే ఇతర రాష్ట్రాల్లోనూ నమోదవుతాయన్న కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యలను మంత్రి కొట్టిపారేశారు. ఒక రాష్ట్రంలో విజయం సాధించినట్లు మరో రాష్ట్రంలో గెలుపొందడానికి ఇది ప్రయోగం కాదని తెలిపారు. ముందు పార్టీ అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ దృష్టి సారించాలని మంత్రి సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని