Sovereign gold scheme: నేటి నుంచే సావ‌రిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 10 ప్రారంభం

భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్‌బీఐ బాండ్ల‌ను జారీ చేస్తుంది.

Updated : 28 Feb 2022 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం 2021-22 సిరీస్-10 సోమ‌వారం ప్రారంభమైంది. ఈ గోల్డ్ బాండ్ ప‌థ‌కం ఇష్యూ ధ‌ర గ్రాముకి రూ. 5,109గా నిర్ణ‌యించారు. ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతిస్తారు. బిడ్డ‌ర్ల‌ కోసం 28 ఫిబ్ర‌వ‌రి నుంచి మార్చి 4వ తేదీ వరకు స‌బ్‌స్క్రిప్ష‌న్ తెరిచి ఉంటుంది.  సిరీస్-9లో గ్రాము ధరను రూ. 4,786గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే చందాదారుల‌కు గ్రాముకి రూ. 50 త‌గ్గించి అందించాల‌ని భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇటువంటి (ఆన్‌లైన్ లేదా డిజిట‌ల్‌) చెల్లింపు పెట్టుబ‌డిదారుల‌కు, ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర గ్రాము బంగారంపై రూ. 5,059గా ఉంటుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది.

పెట్టుబ‌డి ప‌రిమితిః సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కంలో అనుమ‌తించ‌దగిన క‌నీస పెట్టుబ‌డి ఒక గ్రాము బంగారం. స‌బ్‌స్క్రిప్ష‌న్ గ‌రిష్ఠ ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు, అవిభాజ్య హిందూ కుటుంబాల‌కు (హెచ్‌యూఎఫ్‌) 4 కిలోలు, ట్ర‌స్టులు, వాటికి సంబంధించిన సంస్థ‌ల‌కు ఆర్థిక సంవ‌త్స‌రానికి 20 కిలోలు దాకా పెట్టుబ‌డి పెట్టొచ్చు.

కేవైసీ అర్హ‌తః భౌతిక‌ బంగారం కొనుగోలుకు సంబంధించిన  కేవైసీ నిబంధ‌న‌లే వర్తిస్తాయి.

దరఖాస్తు ఎక్కడ..?: ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆర్‌బీఐ బాండ్ల‌ను జారీ చేస్తుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22, సిరీస్ 10ని బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్‌ఈ, బీఎస్‌ఈ)ల‌ ద్వారా విక్రయిస్తారు.

  • ఈ బాండ్ కాలం 8 సంవ‌త్స‌రాలు.. ఐదో సంవత్సరం నుంచి నిష్క్ర‌మ‌ణకు అనుమ‌తి ఉంది.
  • మ‌దుపుదారుల‌కు నామ‌మాత్ర‌పు విలువ‌పై సంవ‌త్స‌రానికి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో వార్షికంగా వడ్డీ చెల్లిస్తారు.
  • మెచ్యూరిటీ వ‌ర‌కు ఉంచిన సావ‌రిన్ గోల్డ్ బాండ్స్‌పై ఎటువంటి మూల‌ధ‌న లాభాల ప‌న్ను విధించరు. ఒక‌వేళ ఎక్స్ఛేంజీల‌లో మెచ్యూరిటీ తేదీకి ముందు ఈ బాండ్స్ విక్ర‌యిస్తే మూల‌ధ‌న లాభాలు వ‌ర్తించే రేట్ల వ‌ద్ద ప‌న్ను విధిస్తారు. సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ నుంచి సంపాదించిన వ‌డ్డీకి మ‌దుపుదారుల ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు.

బాండ్ ధ‌ర నిర్ణ‌యం ఎలా?

ఇండియా బులియ‌న్ అండ్ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ లిమిటెడ్ ప్ర‌క‌టించిన 999 స్వ‌చ్ఛ‌త బంగారం ముగింపు స‌గ‌టు ధ‌ర ఆధారంగా చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌ని దినాల‌ ధ‌ర ఆధారం చేసుకుని బాండ్ ధ‌ర భార‌త క‌రెన్సీ రూపాయల్లో నిర్ణయిస్తారు.

బాండ్స్ ముఖ్య ఉద్దేశం: దేశీయ బంగారం అమ్మ‌కాల్లో ఉన్న డిమాండ్‌కి స‌రిప‌డా ఉత్ప‌త్తి భార‌త్‌లో లేదు. 85% బంగారం భార‌త్ దిగుమ‌తి చేసుకున్న‌దే. ఈ దిగుమ‌తులు త‌గ్గించ‌డానికి భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు బ‌దులుగా.. ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే ల‌క్ష్యంతో సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాన్ని 2015 న‌వంబ‌ర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు