Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో ‘అమెరికా అప్పుల’ జోష్‌!

Stock Market: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది.

Published : 29 May 2023 09:37 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 492 పాయింట్ల లాభంతో 62,993 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 129 పాయింట్ల లాభంతో 18,628 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పుంజుకొని 82.53 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

యూఎస్‌ ఫ్యూచర్‌ మార్కెట్లు ప్రస్తుతం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అప్పుల పరిమితి పెంపుపై అధ్యక్షుడు బైడెన్‌, హౌస్‌ స్పీకర్‌ మెకార్థి మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ నేడు సమావేశం కానున్న నేపథ్యంలో మదుపర్ల దృష్టి అటువైపు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 1 శాతం పెరిగి 78 డాలర్ల ఎగువకు చేరింది. శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,841 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపర్లు సైతం రూ.350 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

మహీంద్రా అండ్‌ మహీంద్రా: వ్యాపార విభాగాలన్నీ రాణించడంతో గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు లాభాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నమోదుచేసింది. 2021-22లో ఏకీకృత నికర లాభం రూ.6,577 కోట్లు కాగా.. 2022-23లో 56% అధికంగా రూ.10,282 కోట్లకు చేరింది. సంస్థ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం. ఆదాయం రూ.90,171 కోట్ల నుంచి 34% పెరిగి రూ.1,21,269 కోట్లకు చేరింది.

సన్‌ఫార్మా: మార్చి త్రైమాసికంలో సన్‌ఫార్మా ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.1,984 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో కంపెనీ రూ.2,277 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.9,447 కోట్ల నుంచి రూ.10,931 కోట్లకు చేరుకుంది.

సెయిల్‌: ప్రభుత్వరంగ ఉక్కు దిగ్గజం సెయిల్‌, మార్చి త్రైమాసికంలో రూ.1159.21 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2478.82 కోట్ల కంటే ఇది 50% కంటే తక్కువ. మొత్తం ఆదాయం రూ.31,175.25 కోట్ల నుంచి రూ.29,416.39 కోట్లకు తగ్గింది.

ఎన్‌సీసీ: నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ, మార్చి త్రైమాసికంలో రూ.4981.36 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.190.86 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.3491.76 కోట్ల ఆదాయంపై, రూ.242.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.15,701 కోట్లు, నికర లాభం రూ.609.20 కోట్లుగా ఉంది. రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.20 (110%) డివిడెండు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: మార్చి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,355.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,070.46 కోట్లతో పోలిస్తే ఇది 42.12% తక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.28,811.39 కోట్ల నుంచి రూ.33,462.14 కోట్లకు వృద్ధి చెందింది.

ONGC: జనవరి- మార్చి త్రైమాసికానికి ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) రూ.247.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.8,859.54 కోట్లుగా నమోదైంది. పన్ను బకాయిల కేసులకు సంబంధించి రూ.12,100 కోట్ల వరకు కేటాయింపులు చేయాల్సి రావడమే సంస్థ నష్టాలను ప్రకటించేందుకు కారణమైంది.

అరబిందో ఫార్మా: కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.6,473 కోట్ల ఆదాయాన్ని, రూ.506 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా: విమానాశ్రయాలు, మౌలిక వసతుల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,894.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర నష్టం రూ.636.74 కోట్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని