Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది.

Updated : 19 May 2023 09:43 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, టాటా స్టీల్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డెట్‌ సీలింగ్‌ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందన్న అంచనాలు అక్కడి మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. మరోవైపు నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీలు 33 ఏళ్ల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలో వేగం, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్‌కు ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. ఈ రోజు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, గ్లెన్‌మార్క్‌, జొమాటో వంటి కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎఫ్‌ఐఐలు గురువారం రూ.970.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ మదుపర్లు రూ.849.96 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రికార్డు లాభాలను ప్రకటించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.16,694.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.9,113.53 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 83% అధికం. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 90% పెరిగి రూ.18,094 కోట్లకు చేరింది.

ITC: మార్చి త్రైమాసికంలో ఐటీసీ లిమిటెడ్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,225.02 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.4,259.68 కోట్లతో పోలిస్తే ఇది 22.66% అధికం. అన్ని విభాగాల్లో బలమైన వృద్ధి నమోదుకావడం కలిసొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.17,754.02 కోట్ల నుంచి 7% వృద్ధితో రూ.18,799.18 కోట్లకు చేరింది.

కిమ్స్‌ హాస్పిటల్స్‌ (KIMS): ‘కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. ఏకీకృత ఖాతాల ప్రకారం త్రైమాసిక ఆదాయం 54.7%, నికరలాభం 18.4% పెరిగాయి. మార్చి త్రైమాసికంలో రూ.575.92 కోట్ల ఆదాయం పై రూ.98.6 కోట్ల నికరలాభాన్ని కిమ్స్‌ ఆర్జించింది.

నజారా టెక్‌: ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన నోడ్విన్‌ గేమింగ్‌ 28 మిలియన్‌ డాలర్లు సమీకరించనుంది. ఈ మేరకు ప్రస్తుత ఇన్వెస్టర్లు నజారా, క్రాఫ్టన్‌, జెట్‌సింథెసిస్‌ సహా కొత్త ఇన్వెస్టర్లతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌: ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణ రేట్లను వివిధ కాలపరిమితులకు సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ పెంచింది.

రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌: విను బల్వంత్‌ సైనీని రతన్‌ ఇండియా సీఎఫ్‌ఓగా నియమించింది. ఆయన నియామకం మే 20 నుంచి అమల్లోకి రానుంది.

వీటితో పాటు గురువారం మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, టాటా ఎల్‌క్సీ, యునైటెడ్‌ స్పిరిట్స్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, బాటా ఇండియా, గ్లాండ్‌ ఫార్మా, పీటీసీ ఇండియా, యూనివర్సల్‌ కేబుల్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని