Stock Market: ఊగిసలాటలో మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 17,125

Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 71 పాయింట్ల నష్టంతో 58,166 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు నష్టపోయి 17,125 దగ్గర కొనసాగుతోంది.

Updated : 14 Mar 2023 09:32 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే సూచీలు ఇలా ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 71 పాయింట్ల నష్టంతో 58,166 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు నష్టపోయి 17,125 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.34 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లపై సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB) సంక్షోభ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయంగా చూస్తే ఆహార పదార్థాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో గత నెలలో రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. భారత్‌లో రిటైల్‌ డిపాజిట్లు అధికంగా ఉన్నందున ఎస్‌వీబీ ప్రభావం దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థపై పెద్దగా ఉండకపోవచ్చుననే విశ్లేషణలు మదుపర్లకు కొంత ఊరట కలిగించే విషయం. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఆ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థతో పాటు అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది. ఇది కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచే అంశం. మరోవైపు వరుసగా మూడోరోజూ విదేశీ మదుపర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. సోమవారం రూ.1,546 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

సన్‌ టీవీ నెట్‌వర్క్‌: మార్చి 2023తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై సన్‌ టీవీ రూ.2.5 డివిడెండ్‌ను ప్రకటించింది.

గెయిల్‌ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గెయిల్‌ ఒక్కో షేరుపై రూ.4 డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి 2023 మార్చి 21ని రికార్డు తేదీగా నిర్ణయించింది.

లుపిన్‌: అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ.. పుణెలోని లుపిన్‌ బయోరీసెర్చ్‌ సెంటర్‌లో తనిఖీలను పూర్తి చేసింది. ఎలాంటి పరిశీలనలు లేకుండానే ఈ ప్రక్రియ పూర్తి కావడం గమనార్హం.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: షేర్ల రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు పీఎన్‌బీ హౌసింగ్‌కు సెబీ అనుమతినిచ్చింది.

సూర్య రోష్నీ: సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌కు కావాల్సిన 3ఎల్‌పీఈ పూత స్టీల్‌ పైప్‌ల సరఫరాకు హిందూస్థాన్‌ పెట్రోలియం నుంచి రూ.96.39 కోట్ల ఆర్డర్‌ లభించినట్లు సూర్య రోష్నీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని