Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @17,620

Stock Market: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 308 పాయింట్ల నష్టంతో 59,915 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 85 పాయింట్లు నష్టపోయి 17,626 దగ్గర కొనసాగుతోంది. 

Published : 08 Mar 2023 09:36 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 308 పాయింట్ల నష్టంతో 59,915 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 85 పాయింట్లు నష్టపోయి 17,626 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.22 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికాలో వడ్డీ రేట్లు అంచనాల కంటే అధిక స్థాయికి చేరే అవకాశం ఉందని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలు ఇచ్చారు. జనవరిలో వినియోగదారు వ్యయాలు, ద్రవ్యోల్బణం అంచనాలను అందుకోలేదని సెనేట్‌ బ్యాంకింగ్‌ కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో అమెరికా సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. పావెల్‌ వ్యాఖ్యల ప్రభావం చమురు ధరలపైనా కనిపించింది. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 3 డాలర్ల మేర తగ్గి 83.29 డాలర్లకు చేరింది. విదేశీ మదుపర్లు సోమవారం రూ.721 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు సైతం రూ.757.23 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌: కాంట్రాక్ట్‌ లాజిస్టిక్స్‌లో జెవీ పార్ట్‌నర్స్‌ నుంచి మిగిలిన 38.87 శాతం వాటాను ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ కొనుగోలు చేయనుంది. దీంతో కాంట్రాక్ట్‌ లాజిస్టిక్స్‌లో ఆల్‌కార్గో వాటా 100 శాతానికి చేరనుంది.

గెయిల్ ఇండియా: ఈ ఏడాది మధ్యంతర డివిడెండ్‌కు ఆమోదం తెలపడం కోసం గెయిల్‌ బోర్డు మార్చి 13న భేటీ కానుంది.

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ రెండు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో విండ్‌ ఎనర్జీ జోన్‌/ సోలార్‌ ఎనర్జీ జోన్‌- పార్ట్‌- ఎ, పార్ట్‌- బి ప్రాజెక్టుల్లో రూ.3,547 కోట్ల పెట్టుబడి పెడతారు. ఈ రెండింటిపై  రూ.4,071 కోట్ల పెట్టుబడికి పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 6న జరిగిన బోర్డు సమావేశంలో అనుమతి ఇచ్చింది.

లోకేష్‌ మెషీన్స్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీఎన్‌సీ మెషీన్లు, ఆటో విడిభాగాల తయారీ సంస్థ లోకేష్‌ మెషీన్స్‌ లిమిటెడ్‌, ఆయుధాల ఉత్పత్తికి కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది.

పీవీఆర్‌: చెన్నైలో 11 తెరలతో కూడిన మల్టీప్లెక్స్‌ను పీవీఆర్‌ ప్రారంభించింది. దీంతో పీవీఆర్‌ నెట్‌వర్క్‌ 1,674 తెరలకు చేరుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని