Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 93 పాయింట్ల లాభంతో 62,942 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 25 పాయింట్ల లాభంతో 18,660 దగ్గర కొనసాగుతోంది.

Published : 09 Jun 2023 09:32 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 93 పాయింట్ల లాభంతో 62,942 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 25 పాయింట్ల లాభంతో 18,660 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.47 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 0.4 శాతం తగ్గి 76.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.212.40 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.405.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అమెరికాలోని ట్విలియో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాల్యూఫస్ట్‌ డిజిటల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వాల్యూఫస్ట్‌)ను సొంతం చేసుకోనుంది. రక్షణ ఉత్పత్తుల రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ జెన్‌ టెక్నాలజీస్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా రూ.202 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడిని ఉత్పత్తి చేసే సంస్థ అయిన సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌, స్వీడన్‌ కేంద్రంగా పనిచేసే కాఫీ రోస్టర్స్‌ లాఫ్‌బర్గ్స్‌ గ్రూపు నుంచి 6 కాఫీ బ్రాండ్లు కొనుగోలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు