Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 59 పాయింట్ల నష్టంతో 62,286 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 7 పాయింట్లు నష్టపోయి 18,392 దగ్గర కొనసాగుతోంది.

Updated : 16 May 2023 09:50 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఆరంభంలో నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలకు ఆరంభంలో అమ్మకాల సెగ తగిలింది. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 59 పాయింట్ల నష్టంతో 62,286 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 7 పాయింట్లు నష్టపోయి 18,392 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 82.20 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, విప్రో, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, టైటన్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. డెట్‌ సీలింగ్‌ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనపై నేడు చర్చలు ప్రారంభం కానున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐలు సోమవారం రూ.1,685.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.191.20 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 15.24 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 2021 ఆగస్టులో నమోదైన 13.81 బిలియన్‌ డాలర్ల తర్వాత మళ్లీ ఇదే తక్కువ. అంటే 20 నెలల కనిష్ఠస్థాయి. అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో, దేశంలో టోకు ధరలు 34 నెలల కనిష్ఠానికి దిగివచ్చాయి. ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -0.92 శాతంగా నమోదైంది.

గమనించాల్సిన స్టాక్స్‌..

అల్ట్రాటెక్‌ సిమెంట్‌: అనుబంధ సంస్థ అల్ట్రాటెక్‌ నత్‌ద్వారా రాజస్థాన్‌లో 0.8 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న సిమెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

విప్రో: గూగుల్‌ క్లౌడ్‌కు చెందిన ర్యాపిడ్‌ మైగ్రేషన్‌ ప్రోగ్రాంతో తమ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసంధానించనున్నట్లు విప్రో తెలిపింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌: ఎస్‌ఏపీతో తమ భాగస్వామ్యాన్ని విస్తరించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రకటించింది.

ఎన్‌ఐఐటీ: ఆర్‌పీఎస్‌ కన్సల్టింగ్‌లో 10 శాతం వాటా ఎన్‌ఐఐటీ కొనుగోలు చేసింది.

పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణరేట్లను వివిధ కాలపరిమితులకు పెంచాలని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్ నిర్ణయించింది.

బెర్జర్‌ పెయింట్స్‌: జనవరి- మార్చిలో బెర్జర్‌ పెయింట్స్‌ ఏకీకృత నికర లాభం 15.56 శాతం తగ్గి రూ.186.01 కోట్లకు పరిమితమైంది. గోవా ప్లాంటులో అగ్ని ప్రమాదం వల్ల వాటిల్లిన రూ.25.35 కోట్ల నష్టం ఇందుకు కారణమైంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,187.51 కోట్ల నుంచి 11.7 శాతం పెరిగి రూ.2,443,63 కోట్లకు చేరింది.

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: మార్చి త్రైమాసికానికి రూ.5,519 కోట్ల ఆదాయాన్ని, రూ.262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.4,294 కోట్లు, నికరలాభం రూ.183 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 29%, నికరలాభం 43% పెరిగాయి.

కల్యాణ్‌ జువెలర్స్‌: 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.697.99 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.720.40 కోట్లతో పోలిస్తే ఇది 3.11% తక్కువ. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,868.52 కోట్ల నుంచి రూ.3,396.42 కోట్లకు పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని