Stock Market: భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 17,400

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 671.15 పాయింట్ల నష్టంతో 59,135.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 176.70 పాయింట్లు నష్టపోయి 17,412.90 దగ్గర ముగిసింది.

Published : 10 Mar 2023 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. బ్యాంకింగ్‌, స్థిరాస్తి రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు ప్రస్తుతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ వంటి షేర్లు నష్టపోవడమూ ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ సంక్షోభం అంచుకు చేరుకుందన్న వార్తలు అమెరికా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను తీవ్ర కలవరానికి గురి చేశాయి. ఆ ప్రభావం మన బ్యాంకింగ్‌ షేర్లపైనా కనిపించింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 59,259.83 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,884.98 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 671.15 పాయింట్ల నష్టంతో 59,135.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,443.80 దగ్గర ప్రారంభమై 17,324.35 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 176.70 పాయింట్లు నష్టపోయి 17,412.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.00 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, టైటన్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్ భారీగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

అదానీ గ్రూప్‌ షేర్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ పవర్‌ 4.59 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్‌, సెజ్‌ స్థిరంగా ముగిసింది. ఏసీసీ. అంబుజా సిమెంట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ నష్టపోయాయి.

అనుబంధ సంస్థ టాటా టెక్‌ ఐపీఓకి రానుండడంతో టాటా మోటార్స్‌ షేరు ఈరోజు పాజిటివ్‌గా ట్రేడైంది. 1.06 శాతం లాభపడి రూ.436.80 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో బ్యాంక్‌ నిఫ్టీ సూచీ ఈరోజు 2 శాతం వరకు నష్టపోయింది. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.61 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.19 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.03 శాతం, ఎస్‌బీఐ 2.01 శాతం నష్టపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు