Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 18,200 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 371.83 పాయింట్ల నష్టంతో 61,560.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 104.75 పాయింట్లు నష్టపోయి 18,181.75 దగ్గర ముగిసింది.

Published : 17 May 2023 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో అమ్మకాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మీడియా, స్థిరాస్తి రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. వాహన, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌కు కొనుగోళ్ల అండ లభించింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,932.32 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,340.10 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 371.83 పాయింట్ల నష్టంతో 61,560.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,300.45 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,115.35 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 104.75 పాయింట్లు నష్టపోయి 18,181.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనమై 82.38 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, విప్రో, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

పారాదీప్‌ ఫాస్ఫేట్స్‌ ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు రెండింతలై 3,713.62 కోట్లకు చేరింది. అదే సమయంలో నికర లాభం మాత్రం 73.4 శాతం తగ్గి రూ.9.47 కోట్లకు పరిమితమైంది. కంపెనీ షేరు ఈరోజు 4.05 శాతం నష్టపోయి రూ.53.25 దగ్గర స్థిరపడింది.

ఎస్‌కేఎఫ్‌ ఇండియా నికర లాభం గత ఏడాది నాలుగో త్రైమాసికంలో 12.3 శాతం పుంజుకొని రూ.122.93 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఆదాయం 7 శాతం పెరిగి రూ.1,114.46 కోట్లకు చేరింది. కంపెనీ షేరు ఈరోజు రూ.39.10 తగ్గి రూ.4,425 దగ్గర నిలిచింది.

బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో ఆరియోన్‌ప్రో సొల్యూషన్స్‌ షేరు ఈరోజు 10 శాతం వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకి రూ.582.45 వద్ద ముగిసింది.

ఒబెరాయ్‌ రియాలిటీ మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 6.01 శాతం నష్టపోయి రూ.916.50 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని