Stock Market: రెండోరోజూ లాభాలే.. నిఫ్టీ @17,100

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 355.06 పాయింట్ల లాభంతో 57,989.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 114.45  పాయింట్లు లాభపడి 17,100.05 దగ్గర ముగిసింది.

Updated : 17 Mar 2023 16:20 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకొని భారీ లాభాలతో ఈ వారానికి స్వస్తి పలికాయి. ఐటీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్ల వంటి దిగ్గజ స్టాక్స్‌ భారీగా నష్టపోవడం మధ్యాహ్నం సూచీలను కిందకు లాగింది. తర్వాత ఐటీ స్టాక్స్‌లో వచ్చిన కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు అండగా నిలిచింది. బ్యాంకింగ్‌ రంగంలో వస్తున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అమెరికాలో బడా బ్యాంకులు చేస్తున్న యోచనలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మరోవైపు గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కీలక కౌంటర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కలిసొచ్చింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 58,038.17 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,178.94- 57,503.90 మధ్య కదలాడింది. చివరకు 355.06 పాయింట్ల లాభంతో 57,989.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,111.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,145.80- 16,958.15 మధ్య ట్రేడైంది. చివరకు 114.45 పాయింట్లు లాభపడి 17,100.05 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 82.56 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, మారుతీ, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

నిన్న భారీగా పుంజుకున్న స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిజ్‌ షేరు ఈ రోజు తిరిగి నష్టాల్లోకి జారుకుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:57 గంటల సమయంలో స్విస్‌ ఎక్స్ఛేంజ్‌ ఎస్‌ఐఎక్స్‌లో ఈ షేరు 3.51 శాతం విలువ కోల్పోయింది.

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే నుంచి జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ రూ.587.59 కోట్లు విలువ చేసే ప్రాజెక్టును సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. కంపెనీ షేరు ఈ రోజు 0.25 శాతం నష్టపోయి రూ.1,027 వద్ద ముగిసింది.

మౌలిక వసతుల అభివృద్ధి, ఈథేన్‌ సోర్సింగ్‌కు సంబంధించి గెయిల్‌ ఇండియా.. షెల్‌ ఎనర్జీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొంది. గెయిల్‌ షేరు నేడు 0.50 శాతం లాభపడి రూ.110.10 వద్ద స్థిరపడింది.

టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ రాజీనామా నేపథ్యంలో కంపెనీ షేరు ఈ రోజు తీవ్ర ఒడుదొడుకులను చవిచూసింది. చివరకు 0.31 శాతం నష్టపోయి రూ.3,175 దగ్గర నిలిచింది.

మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా దశలవారీగా నిధులను సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ భావిస్తోంది. ఈ మేరకు మార్చి 27న బోర్డు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు ఎన్‌ఎస్‌ఈలో 1.29 శాతం పెరిగి రూ.2564 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని