Stock Market: వరుసగా రెండోరోజూ నష్టాలే.. 18,600 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 223.01 పాయింట్ల నష్టంతో 62,625.63 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 71.15 పాయింట్లు నష్టపోయి 18,563.40 దగ్గర ముగిసింది.

Published : 09 Jun 2023 16:08 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజైన శుక్రవారమూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ, కాసేపటికే ఊగిసలాట ధోరణిలోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువవడంతో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. వాహన, లోహ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,810.68 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,992.16- 62,594.74 మధ్య కదలాడింది. చివరకు 223.01 పాయింట్ల నష్టంతో 62,625.63 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,655.90 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,676.65- 18,555.40 మధ్య ట్రేడైంది. చివరకు 71.15 పాయింట్లు నష్టపోయి 18,563.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పుంజుకొని 82.47 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల జారీ ద్వారా 2023- 24లో రూ.50,000 కోట్లు సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. సంస్థ షేరు ఈరోజు 1.65 శాతం నష్టపోయి రూ.578.80 దగ్గర స్థిరపడింది.

1:2 నిష్పత్తిలో షేరు విభజనకు మాన్‌ అల్యూమినియం బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 1.68 శాతం దిగజారి రూ.323 దగ్గర ముగిసింది.

తమిళనాడులో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రీన్‌ల్యామ్‌ ప్రకటించింది. పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటే ఇక్కడ ఏటా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. కంపెనీ షేరు ఈరోజు 20 శాతం పుంజుకొని రూ.482.45 దగ్గర స్థిరపడింది.

జొమాటో షేరు ఇంట్రాడేలో రూ.78 దగ్గర 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. దాదాపు ఏడాది తర్వాత షేరు విలువ ఐపీఓ ధరను అధిగమించింది. చివరకు 2.77 శాతం లాభపడి రూ.77.90 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని