Stock Market: వరుసగా నాలుగో రోజూ లాభాలే.. నిఫ్టీ @ 18,633

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 122.75 పాయింట్ల లాభంతో 62,969.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 35.20 పాయింట్లు లాభపడి 18,633.85 దగ్గర ముగిసింది.

Published : 30 May 2023 16:00 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock market) సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాటలో చలించాయి. ఎట్టకేలకు ఆఖరి గంటన్నరలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో స్థిరపడ్డాయి. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ సూచీలు లాభాలు నమోదు చేశాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఆసియా- పసిఫిక్‌, ఐరోపా మార్కెట్లలోనూ అదే ధోరణి కనిపించింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,839.85 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,036.12- 62,737.40 మధ్య కదలాడింది. చివరకు 122.75 పాయింట్ల లాభంతో 62,969.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,606.65 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,662.45- 18,575.50 మధ్య ట్రేడైంది. చివరకు 35.20 పాయింట్లు లాభపడి 18,633.85 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పతనమై 82.71 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, టైటన్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మార్చితో ముగిసిన త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు గత రెండు రోజుల్లో 25 శాతానికి పైగా పెరిగింది. ఈరోజు కంపెనీ షేరు విలువ 10.14 శాతం పెరిగి రూ.256.30 దగ్గర స్థిరపడింది.

జనవరి-మార్చి త్రైమాసికంలో వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభంలో 48.9 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం మాత్రం 2.7 శాతం వృద్ధి చెందింది. దీంతో కంపెనీ షేరు విలువ 0.64 శాతం నష్టపోయి రూ.248.25 దగ్గర ముగిసింది.

ఆఫ్‌షోర్‌ విండ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులపై వచ్చే 25 ఏళ్ల పాటు ఎలాంటి ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ చార్జీలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ షేరు విలువ 10.68 శాతం పెరిగి రూ.1,589 దగ్గర స్థిరపడింది. ఐనాక్స్‌ విండ్‌ షేరు ధర 1 శాతం పెరిగి రూ.135 వద్ద నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని