Stock Market: 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. 18,300 కిందకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 208.01 పాయింట్ల నష్టంతో 61,773.78 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 62.60 పాయింట్లు నష్టపోయి 18,285.40 దగ్గర ముగిసింది.

Published : 24 May 2023 15:59 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఉదయమే మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో కాసేపు లాభాల్లోకి ఎగబాకినప్పటికీ.. అమ్మకాల సెగతో మళ్లీ దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోవడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,834.28 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,154.14- 61,708.10 మధ్య కదలాడింది. చివరకు 208.01 పాయింట్ల నష్టంతో 61,773.78 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,294.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,392.60- 18,262.95 మధ్య ట్రేడైంది. చివరకు 62.60 పాయింట్లు నష్టపోయి 18,285.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 82.68 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో సన్‌ఫార్మా, టైటన్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, విప్రో షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ మిగిలిన మొత్తం వాటాలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో మహీంద్రా సీఐఈ షేరు ఇంట్రాడేలో 9 శాతానికి పైగా పెరిగి రూ.493.65 వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. చివరకు 4.55 శాతం లాభపడి రూ.473.45 దగ్గర స్థిరపడింది.

గెలాక్సీ సర్ఫాక్టంట్స్‌ షేరు విలువ ఇంట్రాడేలో 6 శాతం నష్టపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ పన్నేతర లాభం వార్షిక ప్రాతిపదికన 8 శాతం నష్టపోయింది. చివరకు కంపెనీ షేరు విలువ ఈరోజు 2.83 శాతం నష్టపోయి రూ.2,520 దగ్గర నిలిచింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో పాలీప్లెక్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లాభం 93.34 శాతం కుంగింది. దీంతో షేరు విలువ 8.28 శాతం నష్టపోయి రూ.1,393.60 దగ్గర ముగిసింది.

వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు దీపక్‌ నైట్రైట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 9.33 శాతం లాభపడి రూ.2,132 దగ్గర స్థిరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు