Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 17,790

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Published : 07 Feb 2023 09:37 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల లాభంతో 60,584 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 27 పాయింట్లు లాభపడి 17,791 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.71 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, టైటన్‌, టాటా మోటార్స్‌, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఇటీవల వెలువడిన ఉద్యోగ గణాంకాలు అక్కడి సూచీలను నిరాశపర్చాయి. వడ్డీరేట్ల పెంపును నిలువరించేందుకు ఫెడ్‌కు మరింత సమయం ఉందనే విశ్లేషణలు వెలువడ్డాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని ఇక్రా అంచనా వేసింది. సోమవారం విదేశీ మదుపర్లు రూ.1,218 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.1,203 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్‌, అదానీ గ్రీన్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, బార్బెక్యూ నేషన్‌, బేయర్‌ క్రాప్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా, కల్యాణ్‌ జువెలర్స్‌, నాగార్జున ఫెర్టిలైజర్స్‌, ఎన్‌డీటీవీ, ఎన్‌హెచ్‌పీసీ, రామ్‌కో సిమెంట్‌, శోభా, ధెర్మాక్స్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

టాటా స్టీల్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో టాటా స్టీల్‌ నష్టాల్లోకి జారింది. రూ.2,501.95 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది కింద ఇదే సమయంలో రూ.9,598.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం. ఇక ఏకీకృత ఆదాయం రూ.60,842.72 కోట్ల నుంచి రూ.57,354.16 కోట్లకు తగ్గింది.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.480.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.767.33 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ. అధిక వ్యయాలు లాభం తగ్గడానికి కారణమయ్యాయి. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,054 కోట్ల నుంచి 16 శాతం వృద్ధి చెంది రూ.5,871 కోట్లకు చేరింది.

విశాక ఇండస్ట్రీస్‌: ఈక్విటీ షేర్లను విభజించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో షేరు ముఖ విలువ రూ.10గా ఉండగా, దీన్ని విభజించాలని ప్రతిపాదించింది. ఒక్కో షేరును ఎన్ని షేర్లుగా విభజించాలనే అంశాన్ని ఈ నెల 22న జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయిస్తారు.

రిలయన్స్‌, అశోక్‌ లేలాండ్‌: హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం ఆవిష్కరించింది. ఈ సాంకేతికతపై పనిచేసే ట్రక్కును ‘ఇండియా ఎనర్జీ వీక్‌’ కార్యక్రమంలో ప్రదర్శించింది.  రెండు పెద్ద హైడ్రోజన్‌ సిలిండర్‌లతో అశోక్‌ లేలాండ్‌ ఈ ట్రక్కును తయారుచేసింది.

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా ప్రమోటరు కుమార్‌ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా, కుమారుడు విక్రమ్‌ బిర్లా చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని