Stock Market: రెండోరోజూ లాభాల్లోనే.. 17,900 చేరువలో నిఫ్టీ!

Stock Market: ఐటీ షేర్ల అండతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. 

Updated : 09 Feb 2023 16:23 IST

ముంబయి: ఐటీ, మీడియా రంగ షేర్ల అండతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండోరోజూ సూచీల్లో లాభాలు నమోదయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు చివరి గంటన్నర వరకు ఒడుదొడుకుల్లో చలించాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల అండతో అక్కడి నుంచి లాభాల్లోకి ఎగబాకాయి. బజాజ్‌ జంట షేర్లు, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,715.89 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,863.63- 60,472.81 మధ్య కదలాడింది. చివరకు 142.43 పాయింట్ల లాభంతో 60,806.22 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,885.50 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,916.90- 17,779.80 మధ్య ట్రేడయ్యింది. చివరకు 21.75 పాయింట్లు లాభపడి 17,893.45 వద్ద ముగిసింది.

★ సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 18 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డ షేర్ల జాబితాలో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, మారుతీ, టాటా స్టీల్‌ అత్యధికంగా నష్టపోయాయి.

అదానీ షేర్లు మళ్లీ నష్టాల్లోకి..

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత వరుసగా పతనమవుతున్న అదానీ కంపెనీల షేర్లకు గత రెండురోజుల్లో ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. నష్టాల పరంపర తిరిగి ఈరోజు  ప్రారంభమైంది. ఆరంభంలోనే షేర్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. కొన్ని అదానీ కంపెనీల షేర్ల ‘ఫ్రీ ఫ్లోట్‌ స్టేటస్‌’లో మార్పును ఎంఎస్‌సీఐ సూచీ నేడు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో షేర్ల పతనం మళ్లీ ప్రారంభమైంది. అత్యధికంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 11.91 శాతం నష్టపోయింది. మరోవైపు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ విల్మర్‌ మాత్రం 4.99 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం గమనార్హం.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

అదానీ పవర్‌ నేతృత్వంలోని ఆరు అనుబంధ సంస్థల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. కంపెనీ స్టాక్‌ ఈరోజు 5 శాతం నష్టపోయి రూ.172.80 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ని తాకింది.

మూడో త్రైమాసికంలో ఐఆర్‌సీటీసీ ఆదాయం 70 శాతం పెరిగి రూ.918 కోట్లకు చేరింది. నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.255.5 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు ఈరోజు 1.30 శాతం పెరిగి రూ.649.65 వద్ద స్థిరపడింది.

నాట్కో ఫార్మా ఆదాయం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 12 శాతం తగ్గి రూ.493 కోట్లుగా నమోదైంది. నికర లాభం 23 శాతం క్షీణించి రూ.62 కోట్లకు చేరింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 0.27 శాతం నష్టపోయి రూ.529.25 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని