Stock Market: నాలుగోరోజూ నష్టాలే.. 17,050 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ 337.66 పాయింట్ల నష్టంతో 57,900.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043.30 దగ్గర ముగిసింది.

Updated : 14 Mar 2023 16:39 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నప్పటికీ.. ఎంతోసేపు నిలబడలేకపోయాయి. ఐటీ, లోహ, బ్యాంకింగ్‌ షేర్లలో వచ్చిన అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. మరోవైపు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం ప్రభావమూ కొనసాగింది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిఫ్టీ 50, సెన్సెక్స్‌ సూచీలు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 58,168.75 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,490.98- 57,721.16 మధ్య కదలాడింది. చివరకు 337.66 పాయింట్ల నష్టంతో 57,900.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,160.55 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,224.65- 16,987.10 మధ్య ట్రేడైంది. చివరకు 111 పాయింట్లు నష్టపోయి 17,043.30 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.48 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఈరోజు తిరిగి అన్నీ నష్టాల బాటలో పయనించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ దాదాపు 9 శాతం నష్టపోయింది. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవర్‌, ఎన్‌డీటీవీ లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. ఇంట్రాడేలో ఈ షేరు రూ.5,716 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1.62 శాతం నష్టంతో రూ.5,739 దగ్గర స్థిరపడింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 5.64 శాతం కుంగింది.

బంధన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఇండస్ట్రీస్‌, ముథూట్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఎంఫసిస్‌, దివీస్‌ ల్యాబ్స్‌, బయోకాన్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు ఈరోజు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ షేర్లు ఈరోజు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.590తో పోలిస్తే ఐదు శాతం లాభంతో షేర్లు మార్కెట్‌లో లిస్టయ్యాయి. చివరకు 2.58 శాతం లాభంతో రూ.605.2 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ ఫార్మా సూచీ రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. సిప్లా, దివీస్‌, లారస్‌ ల్యాబ్స్‌  వంటి ప్రముఖ షేర్లన్నీ ఈరోజు 52 వారాల కనిష్ఠం వద్ద ట్రేడయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని