Stock Market: మే నెలకు నష్టాలతో ముగింపు.. 18,550 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 346.89 పాయింట్ల నష్టంతో 62,622.24 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 99.45 పాయింట్లు నష్టపోయి 18,534.40 దగ్గర ముగిసింది.

Published : 31 May 2023 16:07 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఫలితంగా మే నెల సిరీస్‌కు మార్కెట్లు నష్టాలతో ముగింపు పలికాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లు ఈరోజు రాత్రి ఓటింగ్‌కు రానుండడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. ఇదే మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. మరోవైపు గతకొన్ని రోజుల వరుస లాభాల నేపథ్యంలో కొన్ని కీలక కౌంటర్లలో ఈరోజు లాభాల స్వీకరణ కనిపించింది. అలాగే రేపు వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉండడం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,839.97 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,876.77- 62,401.02 మధ్య కదలాడింది. చివరకు 346.89 పాయింట్ల నష్టంతో 62,622.24 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,594.20 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,603.90- 18,483.85 మధ్య ట్రేడైంది. చివరకు 99.45 పాయింట్లు నష్టపోయి 18,534.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు పతనమై 82.73 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టైటన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో జిందాల్‌ సా లిమిటెడ్‌ షేరు ఈరోజు 14.06 శాతం లాభపడి రూ.240.20 దగ్గర స్థిరపడింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో క్యాంపస్‌యాక్టివ్‌వేర్‌ బలహీన ఫలితాలను నమోదు చేసింది. దీంతో కంపెనీ షేరు గత రెండు రోజుల్లో 15 శాతానికి పైగా నష్టపోయింది. ఈరోజు 8.68 శాతం నష్టపోయి రూ.302.85 దగ్గర ముగిసింది. 

జనవరి- మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో యురేకా ఫోర్బ్స్‌ షేరు విలువ గత రెండు రోజుల్లో 29 శాతానికి పైగా నష్టపోయింది. ఈరోజు కంపెనీ షేరు 9.26 శాతం లాభపడి రూ.495 వద్ద స్థిరపడింది.

టొరెంట్‌ ఫార్మా మార్చి త్రైమాసిక ఫలితాలు మదుపర్లను ఉత్సాహరిచాయి. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో రూ.1884 దగ్గర రికార్డు గరిష్ఠానికి చేరింది. చివరకు 6.14 శాతం పుంజుకొని రూ.1,819 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని