SVB Crisis: 10 రోజుల ముందే షేర్లు అమ్మేసిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ చీఫ్‌

Silicon Valley Bank: అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభానికి ముందే ఆ బ్యాంక్‌ సీఈఓ తన షేర్లను విక్రయించినట్లు తెలిసింది. 10 రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది.

Published : 11 Mar 2023 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా సహా ఇతర మార్కెట్లలో బ్యాంకింగ్ స్టాక్స్‌ పతనానికి కారణమైన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon Valley Bank) విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌ సంక్షోభం తలెత్తడానికి కొద్ది రోజుల ముందే బ్యాంక్‌ చీఫ్‌, సీఈవో గ్రెగ్‌ బెకర్‌ తన షేర్లు అమ్ముకున్నారని తెలిసింది. ఎస్‌వీబీ మాతృ సంస్థ అయిన ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌లో ఉన్న 3.6 బిలియ్‌ డాలర్ల విలువైన 12,451 షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని ఆ గ్రూప్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. షేర్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని జనవరి 26నే నియంత్రణ సంస్థలను బెకర్‌ కోరినట్లు వెల్లడైంది. బ్యాంకింగ్‌ సంక్షోభానికి కొద్ది రోజుల ముందే  బెకర్‌ తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు బెకర్‌గానీ, ఎస్‌వీబీ గ్రూప్‌ గానీ అధికారికంగా స్పందించలేదు. బ్యాంకులో వాటాల విక్రయం ప్రతిపాదన గురించి బెకర్‌కు ముందే తెలుసా అనేదీ తెలియరాలేదు.

Also Read: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కలకలం

ఎవీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు సమకూరుస్తుంటుంది. నష్టాలను పూడ్చుకోవడం, పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించడంతో పాటు 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ గురువారం ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చనీ పేర్కొంది. దీంతో బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. గురువారం ఏకంగా ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేర్లు ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్‌ను నిలిపివేయడంతో పాటు బ్యాంక్‌ను అక్కడి నియంత్రణ సంస్థలు మూసివేశాయి. ఆస్తులనూ జప్తు చేశాయి.

నేను కొంటా: మస్క్‌

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభంపై ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎస్‌వీబీని  డిజిటల్‌ బ్యాంక్‌గా మారుస్తానంటూ ట్వీట్‌ చేశాడు. ‘ఎస్‌వీబీని ట్విటర్‌ కొనుగోలు చేసి డిజిటల్‌ బ్యాంక్‌గా మార్చాలి’ అంటూ ఎలక్ట్రానిక్‌ కంపెనీ రేజర్‌ సీఈవో మిన్‌-లియాంగ్‌ టన్ ట్వీట్‌ చేయగా.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్‌ మస్క్‌ బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని